Uttarandra MLC Results: డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-18T02:02:38+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌ డిపాజిట్‌ కోల్పోయారు.

Uttarandra MLC Results: డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఏంటంటే..

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌ డిపాజిట్‌ కోల్పోయారు. మొత్తం పోలైన వాటిలో చెల్లిన (వేలిడ్‌) ఓట్లు తీసుకొని, అందులో ఆరో వంతు కంటే తక్కువ వచ్చిన వారిని డిపాజిట్‌ కోల్పోయినట్టుగా ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో 2,01,335 మంది (పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి) ఓటు హక్కు వినియోగింకుకున్నారు. అందులో చెల్లిన ఓట్లు 1,89,017. ఆరో వంతు అంటే 31,502 ఓట్లు. అయితే బీజేపీ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కు 10,884 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఆయన డిపాజిట్‌ కోల్పోయారు.

ఈ ఎన్నికల్లో 37 మంది పోటీలో ఉన్నారు. వారిలో టీడీపీ, వైసీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థులకు మాత్రమే ఆరో వంతు కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మిగిలిన వారంతా డిపాజిట్‌ కోల్పోయారు. నామినేషన్‌ వేసిన అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్‌గా చెల్లిస్తారు. వారికి ఆరో వంతు ఓట్లు వస్తే...ఆ మొత్తం వెనక్కి ఇస్తారు. రాకపోతే ఆ మొత్తం వెనక్కి ఇవ్వరు. దీనిని ‘డిపాజిట్‌ కోల్పోయారు’ అని అంటారు.

ఊహించిన ఓటమే

ఈ ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ నాయకులు ఆశలు ఏమీ పెట్టుకోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాలని రంగంలో దిగారు. గతంలో టీడీపీతో పొత్తు ఉండడం, ఆ పార్టీ సహకరించం వల్ల ఎమ్మెల్సీగా మాధవ్‌కు విజయం దక్కింది. ఉత్తరాంధ్రలో బీజేపీకి ఉనికి తప్ప, పట్టు లేదు. పోరాటం చేసే నాయకులైతే ఉన్నారు. గతంలో ఎంపీగా హరిబాబు గెలిచినా అప్పుడు కూడా టీడీపీ పొత్తు వల్లే సాధ్యమైంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి స్థానాలను గెలుచుకునే స్థాయికి ఇంకా చేరలేదు. పైగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, రైల్వే జోన్‌ నిర్మాణంలో ఎడ తెడని జాప్యం బీజేపీకి నష్టం చేకూర్చాయి. ఈ రెండు అంశాలు లేకుంటే...మాధవ్‌కు మరిన్ని ఓట్లు పడేవని, డిపాజిట్‌ దక్కేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

బాగా వెనుకబడిన పీడీఎఫ్‌

గ్రామీణ ప్రాంతాల్లో పట్టులేకపోవడమే కారణమంటున్న నాయకులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిని కోరెడ్ల రమాప్రభ గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. ఆమె ప్రచారం కూడా ఆ విధంగానే నిర్వహించారు. ఆమెకు విజయావకాశాలు వున్నాయని ఇంటెలిజెన్స్‌ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యారు. అయితే నగరాలు, పట్టణాల్లో ఉద్యోగులు, కార్మికులు, పట్టభద్రులు పీడీఎఫ్‌కు సహకరించినా, గ్రామీణ ప్రాంతాల్లో పీడీఎఫ్‌కు సరైన యంత్రాంగం లేకపోవడంతో ఆ ఓట్లు రాబట్టుకోలేకపోయామని, అదే మైనస్‌ అయిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 82,958, వైసీపీ అభ్యర్థికి 55,749, పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు వచ్చాయి.

ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటాం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటాం. దీనిపై సమీక్షించుకుంటాం. పోలింగ్‌ పెరిగి వుంటే కొంతవరకు లాబిస్తుందని భావించా. పీడీఎఫ్‌ అభ్యర్థి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేదు. పీడీఎఫ్‌ ఓట్లు చీలిస్తే తమకు లాభిస్తుందని భావించాం. అయితే, పీడీఎఫ్‌కు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. మిగిలిన అంశాలను పార్టీ నాయకులతో కలిసి చర్చిస్తాం.

- సీతంరాజు సుధాకర్‌, వైసీపీ అభ్యర్థి

Updated Date - 2023-03-18T12:00:39+05:30 IST