‘వవ్వేరు’ కుంభకోణాల్లో భాగస్వాములెవరు?

ABN , First Publish Date - 2023-01-03T22:21:23+05:30 IST

వవ్వేరు బ్యాంకులో జరిగిన వరుస కుంభకోణాల్లో భాగస్వాములెవరు? ఎంతెంత వాటాలు పంచుకున్నారో కోవూరు ఎమ్మెల్యే తేల్చాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

 ‘వవ్వేరు’ కుంభకోణాల్లో భాగస్వాములెవరు?
వవ్వేరు బ్యాంకులో జరిగిన అక్రమాలపై మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి3 : వవ్వేరు బ్యాంకులో జరిగిన వరుస కుంభకోణాల్లో భాగస్వాములెవరు? ఎంతెంత వాటాలు పంచుకున్నారో కోవూరు ఎమ్మెల్యే తేల్చాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘వవ్వేరు బ్యాంకు చైర్మన్‌పై వేటు’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎంవీ.శేషయ్య, నాయకులు స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల నోళ్లుగొట్టి ధాన్యం, ఫర్టిలైజర్‌, బ్యాంకు రుణాలు, నగదు, నగలు దోపిడీ చేశారన్నారు. బ్యాంకులో మాయమైన నగదు రికవరీ చేయకుంటే బ్యాంకు ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బ్యాంకులో అక్రమాలు చేసిన సూరా శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే భవంతి నిర్మాణాలకు రైతుల ధనాన్ని మోసుకుపోయారనే ఆరోపణలపై వాస్తవాలు తేల్చి ఎమ్మెల్యేగా మీరు కడతారా లేక మీ తమ్ముళ్లు కడతారో తెలపాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకులో జరిగిన అక్రమాలపై కమిటీ, సెక్రటరీతోపాటు సంబంధిత అధికారులను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాశేశంలో టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ, దుగ్గిశెట్టి హరనాఽఽథ్‌, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, వింజం రామానాయుడు, కావలి వెంకటేశ్వర్లు, బండ్ల కొండయ్య, ఉసురుపాటి ప్రసాద్‌, వల్లూరు శ్రీనివాసులుతోపాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-03T22:21:43+05:30 IST