Adimulapu Suresh: మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ-ఆటోలు

ABN , First Publish Date - 2023-06-08T12:11:31+05:30 IST

చిన్న మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ-ఆటోలను ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

Adimulapu Suresh: మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ-ఆటోలు

అమరావతి: చిన్న మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఈ-ఆటోలను ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adipulapu Suresh) అన్నారు. గురువారం ఉదయం క్లాప్ కార్యక్రమంలో భాగంగా ఈ-ఆటోలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ... పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీరకణలో భాగంగా సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. 36 మున్సిపాలిటీలకు 516 ఈ- ఆటోలను పంపిణీ చేశామన్నారు. రెండవ విడత మరిన్ని ఈ ఆటోలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 123 మున్సిపాలిటీలోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో 120 లక్షల చెత్తబుట్టలను పంపిణీ చేశామన్నారు. గ్రేడ్-1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్భేజ్ టిప్పర్ల వినియోగం జరుగుతోందన్నారు. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలలో వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని మంత్రి చెప్పారు.

త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టూ కంపోస్ట్, 4 బయో మిధనేషన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 ఎస్‌టీపీలను ఏర్పాటు చేశామన్నారు. లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీలలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను (FSTP) ఏర్పాటు చేశామని అన్నారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేశామని.. ఈ- ఆటోల డ్రైవర్లుగా 80 నుంచి 100 మంది మహిళలకు అవకాశం ఇస్తున్నామన్నారు. ఎంఐజీ, టిడ్కో లే అవుట్‌లు త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా పనులు పూర్తి చేస్తామన్నారు. రేపు గుడివాడలో సీఎం జగన్ అన్ని సౌకర్యాలతో టిడ్కో ఇళ్లు ప్రారంభించనున్నారన్నారు. గతంలోనే అన్ని సౌకర్యాలు చంద్రబాబు కల్పించి ఉంటే లబ్దిదారులు టిడ్కో ఇళ్లలో ఇప్పటికే చేరేవారన్నారు. 2,62,000 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి లక్ష్యంగా పనులు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-08T12:12:51+05:30 IST