Amaravathi: శాసనసభలో కనిపించని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు..

ABN , First Publish Date - 2023-03-24T10:29:14+05:30 IST

శాసనసభలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించలేదు. క్రాస్ ఓటింగ్ (Cross Voting) వేసిన ఎమ్మెల్యేల గురించి లాబీల్లో తీవ్ర చర్చ జరిగింది.

Amaravathi: శాసనసభలో కనిపించని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు..

అమరావతి: శాసనసభలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) క్రాస్ ఓటింగ్‍కు పాల్పడ్డారని విస్తృత ప్రచారం జరుగుతోంది. కాగా సమావేశాలకు చివరిరోజయిన శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు (Assembly Meetings) హాజరుకాలేదు. తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మేకపాటి చంద్రశేఖరరెడ్డి బెంగళూరుకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది.

అటు సోషల్ మీడియాలో (Social Media).. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ విషయం కోడై కూయడంతో ఎట్టకేలకు తనపై వచ్చిన ఆరోపణలకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివరణ ఇచ్చుకున్నారు. ‘నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను ఓటు వేశాను. ఉదయమే నా కుమార్తెతో పాటు సీఎం జగన్‌ గారిని కలిశాను. సొంత అన్నలా చూసుకుంటానని నాతో జగన్ చెప్పారు. జగన్ గారి నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చింది. క్రాస్ ఓటింగ్ చేసిందెరో రెండ్రోజుల్లో నిజా నిజాలు బయటికొస్తాయి. మాకు కొన్ని విలువలు ఉన్నాయి. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాం. దళిత మహిళపై దుష్ప్రచారం చేయొద్దు. దళిత మహిళను కాబట్టే ఇలా చులకనగా చూస్తున్నారు. నేను అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉంటే నియోజకవర్గానికి ఇంచార్జ్‌ని పెట్టినప్పుడే రాజీనామా చేయాలి. నేను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ 22 మందిని స్క్రూటిని చేసి నిజాన్ని తేల్చండి. మళ్లీ చెబుతున్నాను.. నాకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో నా పేరును దయచేసి లాగొద్దు’ అని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

తనపై వచ్చిన ఆరోపణలు శ్రీదేవి వివరణ ఇచ్చుకోగా ఇంతవరకూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం స్పందించిన దాఖలాల్లేవ్. పైగా వైసీపీ పెద్దల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వెళ్లినప్పటికీ ఎలాంటి రియాక్షన్ లేదట. కొన్నిసార్లు ఫోన్ స్విచాఫ్ అని కూడా వస్తోందట. కనీసం రిటర్న్ కాల్ కూడా రాకోవడంతో అధిష్ఠానం అనుమానమే నిజమేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గానికి పరిశీలకుడిగా ధనుంజయ్ రెడ్డిని అధిష్ఠానం నియమించడంతో మేకపాటి చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన టీడీపీకి ఓటు వేసి ఉంటారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ఆయన మీడియా ముందుకు రావాల్సిందే.. లేదంటే.. స్క్రూటినీలో నిజాలు తేలాల్సిందే.

Updated Date - 2023-03-24T10:42:27+05:30 IST