Share News

Vijayawada: రెండు అలంకరణలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

ABN , First Publish Date - 2023-10-23T07:41:50+05:30 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. సోమవారం రెండు అలంకరణలలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Vijayawada: రెండు అలంకరణలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. సోమవారం రెండు అలంకరణలలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్ధనికి ఎంతో విశిష్టత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

మధ్యాహ్నం నుండి దశమి గడియల్లో అంటే విజయదశమినాడు శ్రీ రాజరాజేశ్వరిదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణితమైంది. సింహావాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురిడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బిడాలుడు, వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్దంలో దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో కీలాద్రిపై స్వయంభువైంది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతిపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేసారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారి సహజస్వరూపం ఇదే. మహిషాసుర మర్ధనని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని సాత్విక భావం ఏర్పడుతుంది. సర్వదోషాలు పటాపంచలై ధైర్య , స్థైర్య , విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. మహిషాసురమర్ధనిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరిని కూడా దర్శించుకోవాలనే నానుడి భక్తుల్లో ఇప్పటికీ నెలకొనిఉంది.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు జరుపుకుంటారు. విజయదశమికి ఎంతో విశిష్టత ఉంది. రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు సింహావాహనంపై ఆసీనురాలై ఉంటారు. షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి, శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించిది కాబట్టి విజయ అని అంటారు.

పరమశాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతితో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ దేవిని సేవించడం వలన జీవితం ధన్యమవుతుందని, నవరాత్రుల పుణ్యపలం సకల శుభాలు, విజయాలు సిధ్దిస్తాయని భక్తుల విశ్వాసం. కాగా ఈ రోజు సాయంత్రం కృష్ణానదిలో ఉత్సవమూర్తులను పోలీసులు ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల స్వామివార్లు హంసవాహాణంపై నదివిహారం చేస్తారు.

Updated Date - 2023-10-23T07:41:50+05:30 IST