Share News

Vijayawada: బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ..

ABN , First Publish Date - 2023-10-15T09:25:43+05:30 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.

Vijayawada: బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు.

ఎంతో మహిమాన్వితమైన బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. బాలాదేవి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. నవరాత్రులలో మొదటి రోజు దర్శనమిస్తున్న బాలా త్రిపురసుందరీదేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.

అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవి

అక్టోబర్ 17న అన్నపూర్ణాదేవి

అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మి దేవి

అక్టోబర్ 19న శ్రీ మహాచండీ దేవి

అక్టోబరు 20న మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి

అక్టోబర్ 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

అక్టోబరు 22న శ్రీ దుర్గాదేవి

అక్టోబరు 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది.

Updated Date - 2023-10-15T09:25:43+05:30 IST