Electric Vehicles: పొరుగు రాష్ట్రాల్లో కొని ఇక్కడకు తెచ్చుకునే వారినీ వదలడం లేదుగా..!

ABN , First Publish Date - 2023-09-01T20:43:32+05:30 IST

ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనాలనుకునేవారి ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం.. పొరుగు రాష్ర్టాల్లో కొని ఇక్కడకు తెచ్చుకునే వారినీ వదలట్లేదు. లైఫ్‌ ట్యాక్స్‌ పేరిట భారీగా వసూలు చేస్తుండటంపై వాహనదారులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లోని ఎలక్ట్రిక్‌ వాహనాలపై (ఈవీలు) లైఫ్‌ ట్యాక్స్‌ విధింపు లేదు.

Electric Vehicles: పొరుగు రాష్ట్రాల్లో కొని ఇక్కడకు తెచ్చుకునే వారినీ వదలడం లేదుగా..!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనాలనుకునేవారి ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం.. పొరుగు రాష్ర్టాల్లో కొని ఇక్కడకు తెచ్చుకునే వారినీ వదలట్లేదు. లైఫ్‌ ట్యాక్స్‌ పేరిట భారీగా వసూలు చేస్తుండటంపై వాహనదారులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లోని ఎలక్ట్రిక్‌ వాహనాలపై (ఈవీలు) లైఫ్‌ ట్యాక్స్‌ విధింపు లేదు. దీంతో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనేక మంది ఇతర రాష్ర్టాల్లో ఈవీలు కొనటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ఇలా పొరుగు రాష్ర్టాల్లో వాహనాలు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చే వారూ లైఫ్‌ ట్యాక్స్‌ కట్టాల్సిందేనని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు రెట్టింపు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పొరుగు రాష్ర్టాల్లో లైఫ్‌ ట్యాక్స్‌ లేకున్నా ఇతరత్రా రిజిస్ర్టేషన్‌ ఫీజులు వసూలు చేస్తుంటారు. వాటికి తోడు ఇక్కడ 12 శాతం లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి రావడంతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు రెండింటిపైనా సమాంతరంగా లైఫ్‌ ట్యాక్స్‌ వడ్డన ఉంటోంది.


పెను భారమే..

100 కిలోమీటర్ల రేంజ్‌ ఒక ఎలక్ర్టిక్‌ ద్విచక్రవాహనం ధర రూ.1.30 లక్షలు. దీనిపై 12 శాతం లైఫ్‌ ట్యాక్స్‌ అంటే రూ.15,600 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఆ వాహనం ఖరీదు రూ.1.45 లక్షలు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేయటం వల్ల మరో రూ.13 వేలు కలుస్తోంది. తక్కువ శ్రేణి ధర కలిగిన కార్ల విషయానికొస్తే రూ.20 లక్షల ధర ఉంటే, రూ.2.40 లక్షల మేర లైఫ్‌ ట్యాక్స్‌ను చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీ సంఖ్యలో లైఫ్‌ ట్యాక్స్‌ను చెల్లించటం కొనుగోలుదారులకు భారమే. పొరుగు రాష్ర్టాల్లో ద్విచక్ర ఈవీలు రూ.లక్షకే అందుబాటులోకి వస్తున్నాయి. దిగ్గజ కంపెనీలైన ఓలా, ఏథర్‌, టీవీఎస్‌, హీరో, క్వాంటమ్‌కు పొరుగు రాష్ట్రాల్లో లైఫ్‌ ట్యాక్స్‌ లేకపోవటం వల్ల తక్కువ ధరకు వస్తున్నాయి. అక్కడ కొన్న వాహనాలను ఇక్కడికి తీసుకొచ్చాక లైఫ్‌ ట్యాక్స్‌ కట్టాలన్న విషయంపై చాలామందికి అవగాహన లేకపోవడం, అసలు తెలియకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండుచోట్ల రిజిస్ర్టేషన్లు చేయించుకోవటానికి నానా కష్టాలు పడుతున్నారు.

తగ్గుతున్న అమ్మకాలు

ప్రభుత్వం చర్యలు అనాలోచితంగా ఉన్నాయని వాహనదారులు విమర్శిస్తున్నారు. దీంతో చాలామంది వాహనాలు కొనడం మానేస్తున్నారు. ఫలితంగా అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆటోమొబైల్‌ రంగానికి కేంద్రంగా ఉన్న విజయవాడలో పెద్ద సంఖ్యలో ఈవీల యూనిట్లు ఏర్పడ్డాయి. వీటివల్ల చాలామందికి ఉపాధితో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా సమకూరుతుంది. ఈవీల అమ్మకాలు జోరు మీదున్న తరుణంలో ప్రభుత్వం నీళ్లు పోయడంతో కొత్తగా ఆ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ప్రస్తుతం ఈవీల అమ్మకాలు కూడా తగ్గుతున్నాయి. మార్కెట్‌ను నిలుపుకోవటం కోసం ఆయా వాహన తయారీ సంస్థలు తాము సొంతంగా కొంతమేర తగ్గింపులు ఇస్తున్నాయి. మార్కెట్‌లో ఉన్న పోటీ కారణంగా తగ్గింపులు ఇస్తుండటం కూడా తలకుమించిన భారమేనని ఆయా సంస్థలు అంటున్నాయి. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఏర్పడిన ఈవీ యూనిట్లను ఇతర రాష్ర్టాలకు తరలించుకోవటం తప్ప మరో మార్గమేమీ కనిపించట్లేదు.

Updated Date - 2023-09-01T20:43:35+05:30 IST