Maha shivratri: భక్తులతో కిటకిటలాడిన కోటప్పకొండ

ABN , First Publish Date - 2023-02-18T19:58:29+05:30 IST

మహాశివరాత్రి (Maha shivratri) సందర్భంగా శనివారం పల్నాడు జిల్లా (Palnadu District)లోని కోటప్పకొండ (Kotappakonda) శ్రీత్రికోటేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది.

Maha shivratri: భక్తులతో కిటకిటలాడిన కోటప్పకొండ

నరసరావుపేట: మహాశివరాత్రి (Maha shivratri) సందర్భంగా శనివారం పల్నాడు జిల్లా (Palnadu District)లోని కోటప్పకొండ (Kotappakonda) శ్రీత్రికోటేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. లక్షలాది మంది భక్తులు కోటయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శనివారం తెల్లవారుజామున స్వామికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక అలంకారం చేశారు. అర్ధరాత్రి స్వామికి లింగోద్భవ అభిషేకాలు వైభవంగా జరిగాయి. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో ప్రభుత్వం తరపున స్వామికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు, వెండి ప్రభ సమర్పించారు. ప్రభల పండుగగా పేరొందిన కోటయ్య తిరునాళ్లలో 18 భారీ విద్యుత్‌ ప్రభలు కొలువు తీరాయి.

సాధారణ ప్రభలు అధిక సంఖ్యలో కొండకు తరలివచ్చాయి. శివ నామ స్మరణతో కొండ ప్రాంతమంతా మారుమోగింది. మధ్యాహ్నం నుంచి భక్తుల రద్దీ అధికమై అర్ధరాత్రి వరకు కొనసాగింది. ప్రభల విద్యుత్‌ వెలుగులు యాత్రికులను నయనానందాన్ని కలిగించాయి. కొండ వద్ద పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. వీఐపీల తాకిడి అధికంగా ఉంది. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి కార్యాలయం నుంచి వేల సంఖ్యలో వీఐపీ పాసులు జారీ చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవదాయశాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ, మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu), ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు స్వామిని దర్శించుకున్నారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.

Updated Date - 2023-02-18T19:58:30+05:30 IST