CM Jagan: వైఎస్ వివేకా హత్యపై ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ వ్యాఖ్యలు ఇవే.. సునీత పిటిషన్‌తో మరోసారి చర్చకు..

ABN , First Publish Date - 2023-04-21T16:10:13+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శలపై ఆనాడు స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు...

CM Jagan: వైఎస్ వివేకా హత్యపై ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ వ్యాఖ్యలు ఇవే.. సునీత పిటిషన్‌తో మరోసారి చర్చకు..

హైదరాబాద్: మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సీబీఐ విచారణలో వేగం, కోర్టుల్లో వరుస పిటిషన్ల నేపథ్యంలో ఈ కేసు విచారణపై ఉత్కంఠ పెరిగింది. ఎటువంటి ఆంక్షలూ లేకుండా సీబీఐని స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్, అందులో పేర్కొన్న అంశాలు ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి.

‘‘ 19 నవంబర్ 2021న సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు. ముఖ్యమంత్రే స్వయంగా ఒక నిందితునికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అవినాశ్ రెడ్డి పేరు వచ్చిన తర్వాతే జగన్ యాక్టివ్ అయ్యారు. వివేకా హత్యకు సంబంధించిన ఛార్జిషీటులో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, డి.శివశంకర్ రెడ్డిల పేర్లు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రభావవంతమైన నేతలు దర్యాప్తును ముందుకు సాగనీయకుండా అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా వైఎస్ అవినాశ్ రెడ్డిని రక్షించేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు’’ అని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న సుప్రీంకోర్ట్.. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్ట్ ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించిన విషయం తెలిసిందే. అయితే పిటిషన్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ సునీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వివేకా హత్యపై ఆనాడు అసెంబ్లీలో జగన్ అసలు ఏమన్నారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోసారి తెరపైకి వచ్చిన ఆ వీడియో వైరల్‌గా కూడా మారిన నేపథ్యంలో వివేకా హత్యపై అసెంబ్లీలో జగన్ ఏం మాట్లాడారో ఒక లుక్కేద్దాం...

ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) జరిగిన తర్వాత ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శలపై ఆనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మా చిన్నాన్న గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎవరు అధ్యక్ష ఆయన.. నాకు చిన్నాన్న.. చంద్రబాబునాయుడు గారికి కాదు.. అంటే సొంత మా నాన్న తమ్ముడు.. ఒక వైపు వివేకా మా నాన్నకు తమ్ముడు.. మరోవైపు అవినాష్ రెడ్డి నా తండ్రి కజిన్.. మరో చిన్నాన్న కొడుకు.. ఎందుకు హత్య చేస్తారు అధ్యక్ష.. ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది?’’ అని జగన్ అన్నారు.

కాగా ప్రస్తుతం సీబీఐ విచారణలో వాళ్లే నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే సునీత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy), భాస్కర్ రెడ్డి (Bhaskarreddy), ఉదయ్ కుమార్ రెడ్డి (Udaykumarreddy)లను శుక్రవారం మూడోసారి సీబీఐ అధికారులు విచారించారు. మొదటి రోజు బుధవారం తొమ్మిది గంటలు.. రెండవ రోజు గురువారం ఎనిమిది గంటలపాటు విచారణ కొనసాగింది. శుక్రవారం కూడా సాయంత్రం వరకు కొనసాగింది.

Updated Date - 2023-04-21T17:27:56+05:30 IST