Weather report: 15 వరకు వడగాడ్పులే

ABN , First Publish Date - 2023-06-11T20:51:50+05:30 IST

డారి గాలులతో ఉత్తరకోస్తా ఉడికిపోయింది. వరుసగా రెండో రోజు అతి తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది.

Weather report: 15 వరకు వడగాడ్పులే

విశాఖపట్నం: ఎడారి గాలులతో ఉత్తరకోస్తా ఉడికిపోయింది. వరుసగా రెండో రోజు అతి తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఎక్కువ మండలాలు గాడ్పుల తీవ్రతకు నిప్పులకొలిమిని తలపించాయి. మధ్యాహ్న సమయంలో గాడ్పుల ప్రభావానికి ప్రజలు విలవిల్లాడారు. గత రెండు వారాలుగా ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. వీటికి తోడు గాడ్పులు కొనసాగడంతో ఆరుబయట పనిచేసేవారు, ప్రయాణాలు చేసేవారు ఠారెత్తిపోయారు. రాత్రి సమయంలో భూమి నుంచి వేడిసెగలు వస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. ఉత్తరకోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు ఆరు నుంచి తొమ్మిది, కోస్తాలో మిగిలిన చోట్ల నాలుగు నుంచి ఏడు డిగ్రీలు, రాయలసీమలో రెండుమూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

రాయలసీమలో చెదురుమదురు వర్షాలు

రాయలసీమలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. కాగా ఆదివారం కోస్తాలో అనేకచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు, కొద్దిప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తునిలో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, విజయనగరం జిల్లా జామి, కాకినాడ జిల్లాలో కరప, కాకినాడ అర్బన్‌, అనకాపల్లి జిల్లా కేంద్రంలో 44.8 డిగ్రీలు, విశాఖ జిల్లా పద్మనాభం, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 44.7 డిగ్రీలు నమోదయింది. కాగా సోమవారం ఉత్తరకోస్తాలో శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు అనేకచోట్ల తీవ్ర వడగాడ్పులు, కోస్తాలో మిగిలిన చోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈనెల 15వ తేదీ వరకు కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు కొనసాగుతాయని పేర్కొన్నారు. వాతావరణ అనిశ్చితితో రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - 2023-06-11T20:51:50+05:30 IST