Heavy Rains: కోస్తాలో విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2023-03-19T20:28:08+05:30 IST

జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh), విదర్భ మీదుగా కర్ణాటక వరకు, రాజస్థాన్‌ (Rajasthan) నుంచి మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ మీదుగా బంగాళాఖాతం వరకు...

Heavy Rains: కోస్తాలో విస్తారంగా వర్షాలు

విశాఖపట్నం: జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh), విదర్భ మీదుగా కర్ణాటక వరకు, రాజస్థాన్‌ (Rajasthan) నుంచి మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ మీదుగా బంగాళాఖాతం వరకు...వేర్వేరుగా ద్రోణులు విస్తరించాయి. దీంతో బంగాళాఖాతం (Bay of Bengal) నుంచి వచ్చే తేమగాలులు, ఉత్తరాది నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి కలయికతో వాతావరణ అనిశ్చితి నెలకొని రాష్ట్రంలో అనేకచోట్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించాయి. పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు (Heavy Rains) కురిశాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మేఘాలు, వర్షాల కారణంగా ఆదివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

దక్షిణ కోస్తా అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పంటలు, పశువులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీచాయి. మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడి, పొగాకు, మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిసి ముద్దవుతోంది. వర్షం విడవకుండా పడుతుండటంతో తడిసిన మిర్చి పంటను ఆరబెట్టేందుకు సాధ్యం కావడం లేదు. టార్పాలిన్లు, బరకాలు కప్పుతున్నా పంట తడుస్తూనే ఉంది. దీంతో పంట నాణ్యత తగ్గి, రంగుమారి డిమాండ్‌ పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-19T20:35:59+05:30 IST