YCP: నెల్లూరు టూ కర్నూలు.. వైసీపీలో పెరుగుతున్న అసమ్మతి..!

ABN , First Publish Date - 2023-02-04T19:30:58+05:30 IST

ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. సీఎం జగన్ (CM Jagan) కోసం వీరావేశంతో వైసీపీ కార్యకర్తలు (YCP Activists) పనిచేశారు.

YCP: నెల్లూరు టూ కర్నూలు.. వైసీపీలో పెరుగుతున్న అసమ్మతి..!

కర్నూలు: ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. సీఎం జగన్ (CM Jagan) కోసం వీరావేశంతో వైసీపీ కార్యకర్తలు (YCP Activists) పనిచేశారు. ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరుగుతోంది. కిందిస్థాయి నుంచే వైసీపీలో అసమ్మతి పెల్లుబుకుతోంది. దీంతో పార్టీ పునాదులే కదిలిపోతాయి. 2019 ఎన్నికల నాటికి అలాంటి నాయకులే వైసీపీకి పెద్ద సంఖ్యలో ఉన్నారు. జగన్‌‌ను భుజానికి ఎత్తుకుని, పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులవుతోంది. సార్వత్రిక సమరానికి ఏడాదిన్నర కాలం ఉండగానే పార్టీలో అంతర్గత కలహాలు. విభేదాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు జిల్లా (Nellore District) వైసీపీ నేతల తిరుగుబాటు కలకలం రేపుతోంది. నెల్లూరులో ప్రారంభమైన అసమ్మతి రాగాలు.. ఇప్పుడు కర్నూలు (Kurnool)కు పాకాయి. కర్నూలులో 17 మంది వైసీపీ అసమ్మతి కార్పొరేటర్లు సమావేశమయ్యారు. నగరంలో తమకు విలువ లేకుండా పోయిందంటూ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో అభివృద్ధి పనులే జరగడం లేదని, తాము చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదంటున్న వైసీపీ కార్పొరేటర్లు (YCP Corporators) వాపోయారు.

నెల్లూరులో ఏం జరిగింది

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో కార్పొరేషన్‌ మేయరు సహా 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సర్పంచులు 16 మంది, కమ్యూనిస్టులు మరో ఇద్దరు ఉన్నారు. 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఏఎంసీ చైర్మన్‌ సహా నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారు, మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అందరూ వైసీపీ వారే. ఇది మూడు రోజులకు మునుపటి మాట. ఇప్పుడు వీరంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) వర్గమే. ఫోన్‌ ట్యాపింగ్‌లో విషయంలో కలత చెంది వైసీపీని వీడుతున్నానని శ్రీధర్‌రెడ్డి ప్రకటించిన వెంటనే వీరంతా ఈయనకు మద్దతు ప్రకటించారు. వీరితో పాటు వివిధ సామాజిక వర్గాల వారూ కోటంరెడ్డికి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. నాలుగు రోజుల క్రితం వరకు నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలిచే మొదటి స్థానం అనుకున్న రూరల్‌ నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులయ్యింది. బలంగా కనిపించిన నియోజకవర్గంలో నిలదొక్కుకోవడానికి ఊతం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

జగన్ సొంత జిల్లాలోనూ అసమ్మతి

సీఎం సొంత జిల్లాలోనే చాపకింద నీరులా వైసీపీ నేతల మధ్య అసమ్మతి వ్యాపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలవుతుండడంతో ఏడాది ముందే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి బయటికి వస్తోంది. ఇప్పటికే కడప, కమలాపురం, ప్రొద్దుటూరులలో విభేదాలు బయటపడ్డాయి. అయితే అక్కడ ఇంకా అసమ్మతి బహిరంగం కాలేదు. జమ్మలమడుగులో మాత్రం అది అవిష్కృతమైంది. జిల్లాలో సొంతపార్టీ నేతలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. భయం వల్లనో మరేదో తెలియదు గానీ.. నేతలు మాత్రం గుమ్మనంగా ఉంటున్నారు. కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా బయటపడలేదు. ఒక్క కడప జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని కొందరు అంటున్నారు. ప్రతి జిల్లాలో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారని చెబుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అసమ్మతి నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నాలుగేళ్లలో జగన్‌ను ముఖాముఖి కలుసుకోలేని ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలంతా తాము ఎమ్మెల్యే అయి ప్రయోజనం ఏంటని మండిపడుతున్నారు.

Updated Date - 2023-02-04T19:31:04+05:30 IST