TarakaRatna: కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్.. తారకరత్నను బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-01-27T16:22:57+05:30 IST

నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna)కు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ లిప్టింగ్ చేసే అవకాశం...

TarakaRatna: కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్.. తారకరత్నను బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు

కుప్పం: నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna)కు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ లిప్టింగ్ చేసే అవకాశం లేనందున గ్రీన్ ఛానల్‌ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం (Kuppam) నుంచి బెంగుళూరు (Bangalore)లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) చర్చించారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు. అంబులెన్స్కు ఎలాంటి ఆటంకాలు రాకుండా గ్రీన్ ఛానల్ (Green Channel) తరహాలో.. తారకరత్నను తరలించడానికి కర్ణాటక సర్కార్ సహకరిస్తోందని చెప్పారు. మరో అరగంటలో కుప్పం నుంచి బెంగళూర్ మణిపాల్ ఆసుపత్రికి తారకరత్న తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బుచ్చయ్యచౌదరి తెలిపారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర (Padayatra)లో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. లోకేష్‌తోపాటు తారకరత్న కుప్పం మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు నుంచి బయటకు వస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పార్టీ శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. మాసివ్ స్ట్రోక్‌ రావడంతో కుప్పకూలిపోయారని.. వెంటనే డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.

పాదయాత్రలో ఉన్న బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా నిన్నటి నుంచి తారకరత్న.. నారా లోకేష్‌ వెంట ఉండి పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పాదయాత్రలో పెద్ద మొత్తంలో జనం హాజరవడం.. కాస్త తోపులాట జరగడంతో తారకరత్న ఇబ్బందికి గురయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం.

Updated Date - 2023-01-27T16:23:02+05:30 IST