టీడీపీ వైపు మాజీమంత్రి సుచరిత భర్త చూపు..!
ABN , First Publish Date - 2023-01-05T21:31:53+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరగటం ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో వైసీపీ నేతల స్వరాలు మారుతున్నాయి. మొన్న ఆనం రాంనారాయణరెడ్డి
గుంటూరు: అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరగటం ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో వైసీపీ నేతల స్వరాలు మారుతున్నాయి. మొన్న ఆనం రాంనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), నిన్న వసంత, నేడు అదే కోవలోకి గుంటూరు జిల్లా (Guntur District)కు చెందిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత (Sucharita) చేరి తన స్వరం మార్చారు. ఇప్పటి వరకు ఆమె రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ఆర్ కుటుంబాన్ని వీడేదిలేదని చెప్పిన ఆమె.. కొత్త భాష్యంతో ఏ నిమిషానైనా తాను పార్టీ మారే అవకాశం ఉందని కార్యకర్తలతో చెప్పినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం తన నియోజకవర్గం పరిధిలోని కాకుమానులో జరిగిన పార్టీ కార్యకర్తల అంతర్గత సమావేశంలో ఆమె మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు గురువారం సోషల్ మీడియా (Social media)లో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
వైఎస్ కుటుంబానికి ఎంతో విశ్వసనీయురాలైనా సుచరిత వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేకెత్తించింది. మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించటమే కాకుండా జిల్లా అధ్యక్ష పదవికి దూరం చేయటంతో ఆమె మనస్థాపంతో రగిలిపోతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు హోంమంత్రి పదవి పేరు కోసమే ఇచ్చారే తప్ప ఎటువంటి అధికారం ఇవ్వలేదని అప్పట్లోనే ఆమె వాపోయిన సందర్భాలున్నాయి. ఇన్కంటాక్స్ కమిషనర్గా పనిచేసిన సుచరిత భర్త దయాసాగర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా టీడీపీ తరుపునే పోటీ చేయాలనే ఆకాంక్షతో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబందాలున్నాయి.