ED Case : బైజూస్ సీఈవోపై ఈడీ కేసు నమోదు... వల్లమాలిన ప్రేమ కురిపించిన సీఎం జగన్ ఏం చేస్తారో..!

ABN , First Publish Date - 2023-04-29T13:19:43+05:30 IST

బైజూస్ ఆన్‌లైన్ సంస్థ సీఈవో రవీంద్రన్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు అయ్యింది.

ED Case : బైజూస్ సీఈవోపై ఈడీ కేసు నమోదు... వల్లమాలిన ప్రేమ కురిపించిన సీఎం జగన్ ఏం చేస్తారో..!

న్యూఢిల్లీ: బైజూస్ ఆన్‌లైన్ సంస్థ సీఈవో రవీంద్రన్‌పై (Byjus CEO Ravindran) ఈడీ అధికారులు (ED Officials) కేసు నమోదు అయ్యింది. విదేశీ మారక ద్రవ్యం ఉల్లంఘనలపై రవీంద్రన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. శనివారం నాడు బెంగళూరులోని రవీంద్రన్ నివాసం, కార్యాలయాల్లో దాడులు చేపట్టినట్లు ఈడీ అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశారు. బెంగళూర్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఈడీ కేంద్రకార్యాలయం వెల్లడించింది. ఈ దాడుల్లో ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ డేటాను కూడా ఈడీ జప్తు చేసింది. విదేశీమారక ద్రవ్యం వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు రవీంద్రన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద సుమారు రూ.28వేల కోట్లను బైజూస్ కంపెనీ పొందింది. అయితే దానికి సంబంధించిన లెక్కలను బైజూస్ ఇప్పటికీ బయటపెట్టని పరిస్థితి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ ఈ మేరకు దాడులు నిర్వహించింది.

మరోవైపు ఏపీలో బైజూస్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) వల్లమాలిన ప్రేమ కురిపిస్తూ వచ్చారు. బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం (AP Government) ఒప్పందం కూడా చేసుకుంది. విద్యార్ధులకు కంటెంట్ ఉచితంగా ఇస్తామంటూ ఏపీ ప్రభుత్వంతో బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కంటెంట్ అందజేయలేక బైజూస్ చతికిల పడింది. ఒప్పందం ముసుగులో బైజూస్‌కు జగన్‌ కోట్లు దోచిపెట్టినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బైజూస్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి 4.5 లక్షల ట్యాబ్‌లను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ట్యాబ్‌ల కొనుగోలు కోసం రూ.500 కోట్లు కేటాయించింది. బైజూస్‌తో ఒప్పందాన్ని ఏపీ సర్కార్‌ తొలి నుంచి రహస్యంగానే ఉంచింది. అయితే ఒప్పందం కాపీని ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బయటపెట్ట లేదు.

Updated Date - 2023-04-29T13:36:02+05:30 IST