Share News

Chandrababu-IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:27 PM

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Chandrababu-IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు సూచించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు ఈ రోజు ఉదయం లిఖితపూర్వక వాదనలను కోర్టులో దాఖలు చేశారు. మధ్యాహ్నం సీఐడీ తరపున లిఖితపూర్వక వాదనలను కోర్టుకు అందించినట్లు సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇరు పక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ (NBW) జారీచేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీస్ నిబంధనలను లోకేశ్‌ ఉల్లంఘించారని ఆరోపించింది. సాక్ష్యాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా .. పత్రికల క్లిప్పింగ్‌లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేశ్‌ బెదిరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. 41ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కోర్టుకు ఉండదని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. కాగా ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు జడ్జి శుక్రవారం సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌పై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకేశ్‌కు ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 22 , 2023 | 04:07 PM