Chandrababu: ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2023-05-15T21:06:38+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 17వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర (Uttarandhra)లో పర్యటించనున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా..

Chandrababu: ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన

విశాఖపట్నం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 17వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర (Uttarandhra)లో పర్యటించనున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా 17న పెందుర్తి, 18న ఎస్‌.కోట, 19న అనకాపల్లి (Anakapalli) నియోజక వర్గాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు (Chandrababu) విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు పెందుర్తి సమీపంలో గల మహిళా ప్రాంగణం వద్దకు చేరుకుని పంచ గ్రామాల సమస్యపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఐదు గంటలకు మహిళా ప్రాంగణం జంక్షన్‌ నుంచి రోడ్‌షో ప్రారంభమవుతుంది. ఆరు గంటలకు పెందుర్తి జంక్షన్‌ (Pendurthi Junction)లో బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం సరిపల్లి వద్ద బస్సులో బస చేస్తారు. 18వ తేదీ ఉదయం బస్సు వద్ద టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం స్థానిక నాయకులతో మాట్లాడతారు.

మధ్యాహ్నం 12 గంటలకు మత్స్యకారులతో సమావేశం అవుతారు. 3.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి ఎస్‌.కోట వెళతారు. అక్కడ రోడ్‌షో, అనంతరం బహిరంగ సభల్లో పాల్గొన్న అనంతరం ఆరోజు రాత్రి సింకి రిసార్ట్స్‌లో బస చేస్తారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సింకి రిసార్ట్స్‌ నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి సమీపంలోని శంకరం జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ నల్లబెల్లం రైతుల నుంచి వినతిపత్రం స్వీకరిస్తారు. అనంతరం రోడ్‌షో నిర్వహిస్తారు. నాలుగురోడ్ల కూడలి మీదుగా 6.30 గంటలకు నెహ్రూచౌక్‌కు చేరుకుని అ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించి రాత్రి ఎనిమిదికి బయలుదేరి తొమ్మిది గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడ వెళతారు.

Updated Date - 2023-05-15T21:06:38+05:30 IST