Share News

AP News: పరుగులు పెడుతున్న రైల్లో పండంటి బిడ్డ జననం

ABN , First Publish Date - 2023-10-19T10:16:24+05:30 IST

పరుగులు పెడుతున్న రైలులో పండంటి బిడ్డకు ఓ తల్లి జన్మనిచ్చింది. బుధవారం బొకారో ఎక్స్‌ప్రెస్‏లో మరో

AP News: పరుగులు పెడుతున్న రైల్లో పండంటి బిడ్డ జననం

రాజమహేంద్రవరం, (ఆంధ్రజ్యోతి): పరుగులు పెడుతున్న రైలులో పండంటి బిడ్డకు ఓ తల్లి జన్మనిచ్చింది. బుధవారం బొకారో ఎక్స్‌ప్రెస్‏లో మరో మహిళతో కలిసి సీత ఒరోన్‌ అనే 16 ఏళ్ల నిండు గర్భిణి ఈరోడ్‌ నుంచి ధన్‌బాద్‌(Erode to Dhanbad) వెళ్తున్నారు. రైలు ఎక్కిన కాసేపటికి ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. తోటి ప్రయాణికులు ఆమెను బెర్తులో పడుకోబెట్టి సపర్యలు చేశారు. రాజమహేంద్రవరానికి కొంత దూరంలో రైలు ఉండగా సాధారణ ప్రసవమైంది. అప్పటికే రైల్వే అధికారులకు సమాచారం అందడంతో రైలు రాజమండ్రి స్టేషన్‌(Rajahmundry Station)కి చేరుకొనే సరికి డివిజనల్‌ మెడికల్‌ అధికారి, రైల్వే వైద్య సిబ్బంది, ఆర్పీఎఫ్‌ పోలీసులు, డిప్యూటీ ఎస్‌ఎస్‌ తదితరులు చికిత్సకు అవసరమైన సరంజామాతో సిద్ధంగా ఉన్నారు. ఉదయం 9.50 గంటలకు రైలు రాగానే హుటాహుటిన ఎస్‌-1 కోచ్‌ వద్దకు వెళ్లి వైద్యం ప్రారంభించారు. అప్పటికే ప్రసవం కావడంతో రక్తస్రావం అవుతూనే ఉంది. వెంటనే వైద్యులు ప్రసవానంతర వైద్యం చేశారు. ఆ పరిస్థితుల్లో ఆమె ప్రయాణించడం సురక్షితం కాకపోవడంతో స్టేషనులో దించేశారు. బీపీ కూడా తక్కువ ఉండడంతో 108కి ఫోన్‌ చేసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని 108 ఎమర్జెన్సీ టెక్నీషియన్‌ హనీష తెలిపారు.

nani2.jpg

Updated Date - 2023-10-19T10:16:24+05:30 IST