Election Commission of India: ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
ABN , First Publish Date - 2023-07-11T20:32:20+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీఈసీ ఇటీవల ఆదేశించాలు ఇచ్చింది
న్యూఢిల్లీ: ఏపీ సీఈవో (AP Chief Electoral Officer) ముకేశ్ కుమార్ మీనాపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై ముకేశ్ కుమార్ మీనాను సీఈసీ (Chief Election Commissioner of India) రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను తనిఖీ చేయాలని సీఈసీ ఆదేశాలిచ్చారు. ఇంటింటికి వెళ్లే ఈసీ బృందంలో ఆయా రాజకీయ పార్టీలు తమ ఏజెంటును నియమించుకునే అవకాశం ఇవ్వాలని ముకేష్ కుమార్ మీనాకు స్పష్టం చేశారు. ఏపీలో ఈఆర్వోల నియామకం, ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించారు.
ఏపీలో నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీ సీరియస్
రాష్ట్రంలో ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై భారీగా ఫిర్యాదులు నమోదు అవుతుండటంతో మీనాను ఢిల్లీకి సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, స్థానిక యంత్రాంగం ఇష్టారీతిని ఓట్ల చేర్పులు, తీసివేతలపై ఇటీవల పలు పార్టీల నేతలు, స్వచ్ఛంధ సంస్థలు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీఈసీ ఇటీవల ఆదేశించాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనాను సీఈసీ ఢిల్లీకి పిలిచి ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై డిప్యూటీ కమిషనర్తో దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్పై చర్చించారు. 20న రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మీనాను సీఈసీ ఆదేశించినట్లు సమాచారం. ఆగస్టు 2, 3 తేదీల్లో విశాఖలో జిల్లా కలెక్టర్లతో మీనా ఎన్నికల సంఘం సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయిన వారిని తొలగించడం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ఈసీ బిఎల్ఓలు పరిశీలించాలని మీనాకు సీఈసీ ఆదేశించింది. కొత్త ఓటర్లకు సాధ్యమైనంత త్వరగా ఓటర్ కార్డులను ఇవ్వాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు సీఈసీ ఆదేశాలు ఇచ్చింది.