Ashokbabu: గెలిచిన వ్యక్తికి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు..

ABN , First Publish Date - 2023-03-19T10:14:07+05:30 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు (MLC Ashokbabu) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Ashokbabu: గెలిచిన వ్యక్తికి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు..

అమరావతి: వైకాపా ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు (MLC Ashokbabu) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, గెలిచిన తర్వాత 12 గంటలైనా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్పను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పరువును సర్టిఫికెట్ రూపంలో రాంగోపాల్ రెడ్డి (Ramgopal Reddy)కి ఇస్తున్నారన్నారు. సీఎం జగన్ (CM Jagan) పద్ధతి మార్చుకుంటే కనీసం ఎమ్మెల్యేగా అయినా ఉంటారన్నారు. గెలిచిన అభ్యర్థిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఎస్పీ ఫకీరప్ప ఉద్యోగానికి పనికిరారని అన్నారు. ఎస్పీ, కలెక్టర్‌పై చర్యలు తీసుకునేవారకూ అసెంబ్లీని స్తంభింపచేస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధించినా.. ఎన్నికల అధికారులు డిక్లరేషన్‌ ఇవ్వలేదు. రాంగోపాల్‌ రెడ్డి గెలిచారని స్వయంగా ప్రకటించిన అధికారులు.. అనంతరం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నుంచి నిరసన వ్యక్తం కావడంతో యూటర్న్‌ తీసుకున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. వాస్తవానికి వైసీపీ అభ్యర్థి సహా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసన వ్యక్తంచేసినా.. రీకౌంటింగ్‌ జరపాలని కోరినా.. రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మి తొలుత పట్టించుకోలేదు. కానీ, సమయం గడిచేకొద్దీ.. ఆమె మౌనం వహించారు. భూమిరెడ్డికి ఎంతకీ డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళకు దిగారు. భారీ మెజార్టీతో గెలిచిన తమ పార్టీ అభ్యర్థిని అభినందించేందుకు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత తదితరులు జేఎన్‌టీయూ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లారు.

దాదాపు 3గంటల పాటు డిక్లరేషన్‌ ఫారం కోసం వేచిచూశారు. రీ కౌంటింగ్‌ కోరుతూ వైసీపీ వర్గీయులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎన్నికల అధికారులు ఏదో చేస్తున్నారని టీడీపీ వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం వద్ద రాత్రి 11.20 సమయంలో భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డితో కలిసి బైఠాయించారు. టీడీపీ అభ్యర్థికి వెంటనే డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాలని కాలవ, పరిటాల సునీత డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయేందుకు కారులో వచ్చారు. టీడీపీ శ్రేణులు అడ్డుగా వెళ్లడంతో ఆమె తిరిగి కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. ఆ తర్వాత జేసీ కేతన్‌ గార్గ్‌ వాహనాన్ని కూడా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రికత ఏర్పడింది. అర్ధరాత్రి సమయంలో కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత సహా టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో గెలిచారని అధికారులు స్వయంగా ప్రకటించిన భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకువెళ్లి పోలీసులు వ్యానులో పడేశారు. అనంతరం వీరిని అనంతపురం త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2023-03-19T10:14:07+05:30 IST