Yanamala: ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది: యనమల

ABN , First Publish Date - 2023-04-08T14:55:02+05:30 IST

ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆందోళన వ్యక్తం చేశారు.

Yanamala: ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది: యనమల

అమరావతి: ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పంటకు మద్దతుధర లేక క్రాప్ హాలిడే (Crop holiday) ప్రకటించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 2019-20లో వ్యవసాయ ఉత్పత్తి 175 లక్షల టన్నులు ఉంటే.. ప్రస్తుతం 169 లక్షల టన్నులకు పడిపోయిందని విమర్శించారు. అగ్రికల్చర్ గ్రోత్ (Agricultural Growth) 2022-23లో 4.54 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఆహార ధాన్యాల దిగుబడులు పెరిగాయంటూ సీఎం జగన్‌ అసత్యాలు చెబుతున్నారని తప్పుబట్టారు. సాగు విస్తీర్ణం తగ్గితే వృద్ధిరేటు ఎలా పెరిగిందో చెప్పాలి? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

దుక్కి నుంచి దిగుబడి వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు, పొలం నుంచి ఫలసాయం వరకు రైతులను చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్‌ సర్కార్‌.. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ (Budget)లో నిధుల కేటాయింపులు పెద్దగా పెంచలేదు. సాగు రంగానికి పెద్దగా ఊతం ఇవ్వలేదని వ్యవసాయ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. కొత్త పథకాల ఊసే లేని ఈ బడ్జెట్‌లో పాత పథకాలకూ అరకొరగానే నిధులు కేటాయించింది. వ్యవసాయంలో నష్టాలొచ్చి రైతు బలవన్మరణాలకు పాల్పడితే ఇచ్చే ఎక్స్‌గ్రేషియా (Exgratia)లో పెంపుదల లేదు.

నిధుల కేటాయింపు నామమాత్రంగానే చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ భాగం కేంద్ర ప్రయోజిత పథకాల వాటాతోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. నిరుటి దాకా చాలా పథకాలను వినియోగించుకోని జగన్‌ సర్కార్‌ ఈ ఏడాది వాటికి రాష్ట్ర వాటా నిధులు కేటాయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2023-24 బడ్జెట్‌లో రూ.41,436.29కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం 2022-23 కంటే రూ.1,616.49 కోట్లు తగ్గించింది.

వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద 2023-24లో రూ.7,220 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.4,020కోట్లుగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. అంటే కేంద్రం వాటా రూ.3,200 కోట్లుగా ఉంది. ఈ ఏడాది రూ.13,500 చొప్పున. 52.38 లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సుమారు 2లక్షల మంది కౌలు రైతులు, అటవీ భూ హక్కు సాగుదారులు, దేవాలయ మాన్యాల సాగుదారులకు మాత్రమే రూ.13,500 ఇస్తోంది. ఈ ఏడాది పంటల బీమాకు రూ.1,600 కోట్లు, విపత్తుల సహాయ నిధి కింద రూ.2 వేల కోట్లు ప్రతిపాదించింది

Updated Date - 2023-04-08T14:55:02+05:30 IST