Bengaluru: బెంగళూరులో వర్షాలకు ఏపీకి చెందిన టెకీ మృతి

ABN , First Publish Date - 2023-05-21T20:43:51+05:30 IST

బెంగళూరు (Bengaluru)లో భారీ వర్షాలకు తెలుగు యువతి బలయ్యింది. ఆదివారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. గంటకుపైగా వడగళ్ల వాన కురిసింది.

Bengaluru: బెంగళూరులో వర్షాలకు ఏపీకి చెందిన టెకీ మృతి

బెంగళూరు: బెంగళూరు (Bengaluru)లో భారీ వర్షాలకు తెలుగు యువతి బలయ్యింది. ఆదివారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. గంటకుపైగా వడగళ్ల వాన కురిసింది. శనివారం రాత్రి ఇదే తరహాలో వర్షం కురవడంతో చెట్లు నేలకూలి అండర్‌పాస్‌లు జలమయమయ్యాయి. విధానసౌధకు సమీపంలోని కేఆర్‌ సర్కిల్‌ వద్ద అండర్‌పాస్‌ (Underpass)లో లోతును తెలుసుకోలేక వెళ్లిన ఓ కారు నీటిలో చిక్కుకుపోయింది. గమనించిన స్థానికులు సమీపంలోని డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఆరుగురిని రెస్క్యూ ద్వారా రక్షించగలిగారు. తీవ్ర అస్వస్థతకు లోనైన భానురేఖ (22)ను సమీపంలోని సెయింట్‌ మార్థాస్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించక భానురేఖ మృతి చెందారు.

ఆమె బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. బంధుమిత్రులు హైదరాబాద్‌ (Hyderabad) నుంచి రాగా.. నగర సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్దరామయ్య.. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని సీఎం ఆదివారం స్వయంగా పరిశీలించారు. కుటుంబ సభ్యులందరి చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బెంగళూరు పరిధిలో వర్షం ధాటికి పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. నగరంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రమంతటా ఆదివారం భారీ వర్షాలు కురిశాయి.

Updated Date - 2023-05-21T20:43:51+05:30 IST