Munugode By Election: ఉప ఎన్నిక నుంచి గౌరవంగా తప్పుకోవాలి: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-10-28T20:25:06+05:30 IST
ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ (CM KCR) కుట్ర బట్టబయలైనందున మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) నుంచి ముఖ్యమంత్రి గౌరవంగా తప్పుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు.
నల్లగొండ: ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ (CM KCR) కుట్ర బట్టబయలైనందున మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) నుంచి ముఖ్యమంత్రి గౌరవంగా తప్పుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆడియోలు, వీడియోలు ఉన్నప్పుడు కోర్టుకు ఎందుకు ఇవ్వలేదని, కోర్టుకు ఆధారాలు ఇస్తే నిందితులు జైల్లో ఉండేవారు కదా అని ప్రశ్నించారు. లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్, ఆయన కుటుంబం, ఆ నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం డ్రామా అని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ పరువు పోతుందని ఇంకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇంతకముందు జరిగిన ఉప ఎన్నిక, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలో కేసీఆర్ దుకాణం నడవలేదని, మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో ధర్మం గెలుస్తుందని, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి విజయం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.