Rahul Gandhi: మోదీ, కేసీఆర్ మధ్య డైరక్ట్ లైన్ ఉంది
ABN , First Publish Date - 2022-11-01T19:50:40+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మధ్య డైరక్ట్ లైన్ ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మధ్య డైరక్ట్ లైన్ ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎన్నికల ముందు ఇద్దరూ కలిసి డ్రామా చేస్తారని చెప్పారు. ఎప్పుడేమి చేయాలో కేసీఆర్కు మోదీ సూచిస్తారని రాహుల్ చెప్పారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ కూడా నిరుద్యోగం గురించి ఊసెత్తరని ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్లో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు.
పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు టీఆర్ఎస్ మద్దతిస్తోందని, ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు మాత్రం మద్దతీయడం లేదని రాహుల్ ఆరోపించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ను అందరూ చూస్తుండగానే మోదీ స్నేహితులైన వ్యాపారవేత్తలు అతి త్వరలోనే స్వాధీనం చేసుకుంటారని రాహుల్ ఆరోపించారు. పోర్టులు, ఎయిర్పోర్టులను, ఎల్ఐసీని కేంద్రం అమ్మేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల యజమానులు లక్షలు, కోట్ల రూపాయలు రుణం తీసుకోగలుగుతారని, చిరు వ్యాపారులు మాత్రం చిన్న రుణాలు కూడా పొందలేకపోతున్నారని రాహుల్ వాపోయారు.