మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి రోడ్డుకు మహర్ధశ
ABN , First Publish Date - 2022-11-11T20:00:46+05:30 IST
మెదక్ జిల్లా (Medak District) కేంద్రం నుంచి సిద్దిపేట మీదుగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు నిర్మించనున్న జాతీయ రహదారి పనులకు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
సిద్దిపేట: మెదక్ జిల్లా (Medak District) కేంద్రం నుంచి సిద్దిపేట మీదుగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు నిర్మించనున్న జాతీయ రహదారి పనులకు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పెద్దపల్లి జిల్లా (Peddapally district) రామగుండంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ద్వారా ఈ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు 133 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.1460 కోట్ల నిధులను కేటాయించారు. ఇప్పటికే సర్వే పనులు పూర్తికాగా భూసేకరణ జరుగుతున్నది. రెండేళ్లలో రహదారిని నిర్మించేలా టెండర్ల ప్రక్రియ చేపట్టారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా మెదక్ జిల్లా అక్కన్నపేట వద్ద రైల్వేఓవర్ బ్రిడ్జి, రామాయంపేటలో 2 అండర్ పాస్లు, సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లి, రంగధాంపల్లి రాజీవ్ రహదారిపైనా మరో రెండు అండర్పాస్లు, రెండు చోట్లా వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారికి రెండేళ్ల క్రితమే జాతీయ హోదా కల్పించి 765 డీజీ నంబరును కేటాయించారు. ఈ రహదారి నిర్మాణం వల్ల మెదక్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోని రహదారికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుంది. కరీంనగర్ (Karimnagar), జనగామ, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ప్రయాణం సులభతరంగా మారనున్నది.