disabled persons: వికలాంగులకు మినహాయింపు... 10వ తరగతిలో 10 మార్కులకే పాస్‌

ABN , First Publish Date - 2022-11-08T05:58:50+05:30 IST

6 నుంచి 10వ తరగతి చదువుతున్న మానసిక, శారీరక వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక పరీక్షల్లో అనేక

disabled persons: వికలాంగులకు మినహాయింపు... 10వ తరగతిలో 10 మార్కులకే పాస్‌
10th class 10 marks

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): 6 నుంచి 10వ తరగతి చదువుతున్న మానసిక, శారీరక వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక పరీక్షల్లో అనేక మినహాయింపులు కల్పించింది. ఆయా విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు, మూగ, చెవిటి, మెదడు సంబంధిత వ్యాధులు, తలసేమియా, హెమోఫీలియా రోగులు, తీవ్రమైన శాశ్వత అంగవైకల్యం కలిగినవారు, పాక్షిక అంధత్వం, కాలు, చెయ్యి తొలగింపునకు గురైనవారు, వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నవారు, పక్షవాతానికి గురైనవారికి మినహాయింపులు వర్తిస్తాయి. యాసిడ్‌ దాడిలో గాయపడినవారికి కూడా మినహాయింపులు కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వీటిని అనుసరించి.. తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలున్నవారికి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 10కి తగ్గించారు. అలాగే మూగ, చెవిటి, ఇతర అంగవైకల్య సమస్యలున్నవారికి ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 20కి తగ్గించారు. 6, 7, 8, 9 తరగతులతోపాటు 10వతరగతి బోర్డు పరీక్షల్లోనూ ఈ మినహాయింపులు వర్తిస్తాయి. అలాగే పరీక్ష సమయంలో గంట వ్యవధి తర్వాత వీరికి 20 నిమిషాలపాటు విరామం ఇస్తారు. అదేవిధంగా కాలిక్యులేటర్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లను కూడా అనుమతిస్తారు. మూడు లాంగ్వేజెస్‌ స్థానంలో వీరికి ఒక్క లాంగ్వేజ్‌ పరీక్ష మాత్రమే ఉంటుంది. వీరు రాసిన సమాధాన పత్రాలను దిద్దేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమిస్తారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే సదుపాయాన్ని కూడా ఈ విద్యార్థులు వినియోగించుకోవచ్చని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు చేస్తామని విద్యాశాఖ తెలిపింది.

Updated Date - 2022-11-08T05:58:51+05:30 IST