Pilot Rohith Reddy: ప్రగతిభవన్కు పైలట్.. ముఖ్యమంత్రితో చర్చలు

ABN , First Publish Date - 2022-12-17T16:38:30+05:30 IST

పైలట్ రోహిత్‌రెడ్డి (MLA Pilot Rohith Reddy) ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి (Chief minister of Telangana) కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (K. Chandrashekar Rao)తో భేటీ అయ్యారు.

Pilot Rohith Reddy: ప్రగతిభవన్కు పైలట్.. ముఖ్యమంత్రితో చర్చలు
MLA Rohith Reddy meets CM K Chandrashekar Rao

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(BRS)కి చెందిన తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (MLA Pilot Rohith Reddy) ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి (Chief minister of Telangana) కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (K. Chandrashekar Rao)తో భేటీ అయ్యారు. మనీలాండరింగ్‌పై ఈడీ (Directorate of Enforcement) నోటీసులు అందుకున్న పైలెట్‌ ఇదే అంశంపై సీఎంతో మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులోనూ రోహిత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పని చేశారు. ముగ్గురు నిందితులు అరెస్టు అయిన తర్వాత కొద్ది రోజులపాటు ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు.

అంతకు ముందు ఈ ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న పైలట్ రోహిత్‌రెడ్డి పూజలు చేసి అమ్మవారి సాక్షిగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. బండి సంజయ్ తడి బట్టలతో రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి రావాలన్నారు. ‘‘నాకు డ్రగ్స్ కేసులో నొటీసులు వచ్చినట్లు చూపించు. బండి సంజయ్‌కు తంబాకు వల్ల నోరు తిరుగతలేదు. మాకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపికి ముందే ఎలా తెలుసు. బీజేపీకి అబద్దాలు చెప్పడం కామన్‌గా మారింది. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది. నాకు కర్ణాటక పోలీసుల నుంచి నోటీసులు వస్తే అమ్మవారి సాక్షిగా బీజేపీ చూపించాలి. అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్న. నాకు కర్ణాటక నుంచి ఎటువంటి నోటీసు రాలేదు. డ్రగ్స్ కేసుల్లో ఎఫ్ఐఆర్ లో ఎక్కడా నా పేరు లేదు. బండి సంజయ్ నిజంగా హిందు వాది అయితే రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు ఆదారలతో రావాలి. నాకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చాయని చెప్తున్న బీజేపీ ఆధారాలు చూపించాలి. నాకు సోమవారం ఈడీ ఆఫీస్‌కు రావాలని ఈడీ నోటీస్ ఇచ్చారు. నా బయోడేటా కోసమే ఈడీ నోటీసు ఇచ్చింది. రేపు బండి సంజయ్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రాకపోతే... మొన్నటి దొంగస్వాములకు నీకు తేడా ఉండదు. ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు వస్తాయని బీజేపీ ముందే ఎలా చెప్పింది’’ అని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసు (TRS MLAs poaching case) లో రోహిత్ రెడ్డి ఇటీవలే వాగ్మూలం ఇచ్చారు.

హైదరాబాద్‌ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా ఉన్నారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్‌ సభ్యులుగా ఎంపిక చేశారు.

Updated Date - 2022-12-17T16:43:39+05:30 IST