Pakistan: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బోణీ.. నెదర్లాండ్స్ చిత్తు!

ABN , First Publish Date - 2022-10-30T16:04:22+05:30 IST

టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు పాకిస్థాన్ (Pakistan) బోణీ కొట్టింది. భారత్, జింబాబ్వేల చేతుల్లో

Pakistan: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బోణీ.. నెదర్లాండ్స్ చిత్తు!

పెర్త్: టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు పాకిస్థాన్ (Pakistan) బోణీ కొట్టింది. భారత్, జింబాబ్వేల చేతుల్లో ఘోర పరాజయాల తర్వాత కోలుకున్న పాకిస్థాన్.. నెదర్లాండ్స్‌(Netherlands)తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ను పాకిస్థాన్ 91 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. షాదాబ్ ఖాన్, మహ్మద్ వాసిమ్ జూనియర్ బౌలింగ్ దెబ్బకు విలవిల్లాడిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులు మాత్రమే చేసింది. అకెర్‌మన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కెప్టెన్ ఎడ్వర్డ్స్ చేసిన 15 పరుగులు రెండో అత్యధికం. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. షాదాబ్ ఖాన్‌కు 3, మహ్మద్ వాసిమ్ జూనియర్‌కు రెండు వికెట్ల దక్కాయి.

అనంతరం 92 పరుగులు స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 13.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 39 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేయగా, ఫకర్ జమాన్ 20, షాన్ మసూద్ 12 పరుగులు చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం (4) మరోమారు తీవ్రంగా నిరాశపరిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్‌కు రెండు వికెట్ల దక్కాయి. మూడు వికెట్ల తీసి నెదర్లాండ్స్‌ను దారుణంగా దెబ్బతీసిన షాదాబ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Updated Date - 2022-10-30T16:04:24+05:30 IST