World Test Championship: రెండోస్థానంలోకి దూసుకెళ్లిన టీమిండియా

ABN , First Publish Date - 2022-12-18T20:36:20+05:30 IST

బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా

World Test Championship: రెండోస్థానంలోకి దూసుకెళ్లిన టీమిండియా

ఢాకా: బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా (Team India) ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకింది. అదే సమయంలో ఆస్ట్రేలియా (Australia)తో బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఓటమి పాలైన సౌతాఫ్రికా (South Africa) ఓ స్థానం దిగజారింది. ఈ మ్యాచ్‌లకు ముందు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ల తర్వాత స్థానాలు తారుమారయ్యాయి. భారత్ రెండో స్థానానికి ఎగబాకగా, దక్షిణాఫ్రికా మూడో స్థానానికి పడిపోయింది.

76.92 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కమిన్స్ సేన మొత్తం 13 మ్యాచ్‌లు ఆడగా అందులో 9 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇండియా 55.77 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోగా, 54.55 పాయింట్లతో సఫారీ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. అలాగే, శ్రీలంక ఒక స్థానం కోల్పోయి 53.33 పాయింట్లతో నాలుగో స్థానానికి దిగజారింది. 44.44 పాయింట్లతో ఇంగ్లండ్, 42.42 పాయింట్లతో పాకిస్థాన్ ఐదారు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య కరాచీలో మూడో టెస్టు జరుగుతోంది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఇక, వెస్టిండీస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ తొలి టైటిల్‌ను న్యూజిలాండ్‌ (New Zealand)ను సొంతం చేసుకుంది. భారత్-కివీస్ జట్లు ఫైనల్‌కు చేరగా గతేడాది సౌతాంప్టన్‌లో జరిగిన ఫైనల్ టెస్టులో విజయం సాధించిన న్యూజిలాండ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

Updated Date - 2022-12-18T20:36:22+05:30 IST