Team India: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రోహిత్ శర్మ కెప్టెన్ కాదు!

ABN , First Publish Date - 2022-10-31T20:28:11+05:30 IST

న్యూజిలాండ్‌ (New Zealand)తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 16 మందితో

Team India: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రోహిత్ శర్మ కెప్టెన్ కాదు!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ (New Zealand)తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 16 మందితో కూడిన భారత జట్టు (Team India)ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ఈ మేరకు సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ జట్టును ప్రకటించాడు. బ్లాక్ క్యాప్స్‌తో నవంబరు 25 నుంచి న్యూజిలాండ్‌‌లో వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. 25న ఆక్లాండ్‌లో తొలి వన్డే, 27న హామిల్టన్‌లో, 30న క్రైస్ట్‌చర్చ్‌లో చివరి వన్డే జరుగుతుంది. ఈ సిరీస్‌లో భారత జట్టుకు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు డిప్యూటీగా ప్రమోషన్ లభించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతి కల్పించారు. ఈ ఏడాది మొదట్లో వెస్టిండీస్, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లలోనూ టీమిండియాకు ధావన్ స్కిప్పర్‌గా వ్యవహరించాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ (RR)కు ప్రాతినిధ్యం వహించిన కుల్దీప్‌సేన్‌కు సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపు అందింది. కొన్ని సిరీస్‌ల తర్వాత ఉమ్రాన్‌ఖాన్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. సౌతాప్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రాణించిన షాబాజ్ అహ్మద్‌ జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. వన్డే సిరీస్ కంటే ముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవంబరు 18, 20, 22లలో వరుసగా వెల్లింగ్టన్, మౌంట్ మాంగనూయి, నేపియర్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి.

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్-కెప్టెన్), శుభమన్ గిల్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్

Updated Date - 2022-10-31T20:28:12+05:30 IST