T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక భాగస్వామ్యాలు ఇవే!Highest partnerships in T20 World Cups guru

ABN , First Publish Date - 2022-11-10T18:21:56+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత జట్టు (Team India) ఘోర పరాభవాన్ని

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక భాగస్వామ్యాలు ఇవే!Highest partnerships in T20 World Cups guru

అడిలైడ్: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత జట్టు (Team India) ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. భారత్ నిర్దేశించిన 169 పరుగుల విజయ లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించిన ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఊచకోత కోశారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీలకు పంపిస్తూ వీర విజృంభణ చేశారు. 169 పరుగుల లక్ష్యాన్ని వారిద్దరే ఊడ్చిపడేశారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో నమోదైన అత్యధిక భాగస్వామ్యాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

అడిలైడ్‌లో జరిగిన నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్-అలెక్స్ హేల్స్ అజేయంగా సాధించిన 170 పరుగుల భాగస్వామ్యం టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికం. ఇదే టోర్నీలో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్-ఆర్. రోసౌ సాధించిన 168 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యధికం. ఆ తర్వాత విండీస్‌పై 2010లో శ్రీలంక బ్యాటర్లు మహేల జయవర్ధనే-కె.సంగక్కర సాధించిన 166 పరుగులు, ఇండియాపై గతేడాది పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్ సాధించిన 152 పరుగుల భాగస్వామ్యం వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇక, టీ20ల్లో ఇండియాపై ఏ వికెట్‌ కైనా అత్యధిక భాగస్వామ్యం విషయానికి వస్తే.. క్వింటన్ డికాక్-డేవిడ్ మిల్లర్ ఈ ఏడాది గువాహటిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 174 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టీ20ల్లో భారత్‌పై ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. నేటి (గురువారం) మ్యాచ్‌లో జోస్ బట్లర్-అలెక్స్ హేల్స్ 170 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా, గతేడాది దుబాయ్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్ 152 పరుగులు సాధించారు.

టీ 20ల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లండ్ క్రికెటర్ల జాబితాలో డి మలాన్-ఇయన్ మోర్గాన్ ఉన్నారు. వీరిద్దరూ 2019లో నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 182 పరుగులు చేశారు. నేటి (గురువారం) మ్యాచ్‌లో జోస్ బట్లర్-అలెక్స్ హేల్స్ కలిసి భారత్‌పై 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే, 2020లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్-డి మలాన్ కలిసి 167 పరుగులు చేశారు.

టీ20ల్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అత్యధిక టార్గెట్ ఛేదించిన వారిలో బాబర్ ఆజం-రిజ్వాన్ జంట ముందు వరుసలో ఉంది. ఇంగ్లండ్‌తో కరాచీలో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. 2016లో పాకిస్థాన్‌తో హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్-విలియమ్సన్ జంట 170 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఈ ప్రపంచకప్‌లో అడిలైడ్‌లో ఇండియాతో జరిగిన తాజా మ్యాచ్‌లో బట్లర్-హేల్స్ కలిసి 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించారు.

Updated Date - 2022-11-10T18:21:58+05:30 IST