ఆ ఊరందరిదీ అదే పని.. ఇంట్లోనే కూర్చుని ల్యాప్టాప్ ముందేసుకుని ఫోన్కాల్స్.. క్షణాల్లో ఖాతాల్లోకి లక్షల్లో డబ్బు..!
ABN , First Publish Date - 2022-06-18T00:22:41+05:30 IST
బుధవారం ఉదయం 11 గంటలు.. మధ్యప్రదేశ్లోని నివారి జిల్లాలో థౌనా గ్రామం..

బుధవారం ఉదయం 11 గంటలు.. మధ్యప్రదేశ్లోని నివారి జిల్లాలో థౌనా గ్రామం.. గ్రామం పక్కనే ఉన్న పొలంలో కొంతమంది యువకులు మొబైల్, ల్యాప్టాప్లతో కూర్చుని ఉన్నారు.. వేర్వేరు నెంబర్లకు ఫోన్లు చేసి కాల్ సెంటర్ ఉద్యోగిలా లేదా బ్యాంకు అధికారిలా మాట్లాడుతున్నారు.. ఒక యువకుడు మాట్లాడుతూ.. `హలో, నేను మిస్టర్ దేవేంద్ర శాస్త్రితో మాట్లాడుతున్నానా? ఇది బ్యాంక్ నుంచి వచ్చిన ఫోన్ కాల్. సార్.. మీ ఏటీఎమ్ కార్డ్ బ్లాక్ అయింది. మీరు మీ కార్డును రీసెట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్కి ఇప్పుడే ఓటీపీ వచ్చింది.. చెప్పండి` అని అడుగుతున్నాడు.
ఇది కూడా చదవండి..
వైరల్ వీడియో షేర్ చేసిన బిజినెస్ మ్యాన్.. దానికి ఆయన చేసిన కామెంట్ మరింత వైరల్..!
మరో యువకుడు.. `దీదీ, నేను ఆర్మీలో ఉన్నాను. మీ మొబైల్లో నా వాట్సాప్ బార్కోడ్ ఉంది. దాన్ని స్కాన్ చేయండి. నేను ఆన్లైన్లో మీకు డబ్బు బదిలీ చేస్తాను. ఆ డబ్బును నా భార్యకు ఇవ్వండి. మా ఇల్లు మీకు దగ్గర్లోనే ఉంద`ని చెబుతున్నాడు. పోలీసులను, మీడియాను చూసిన ఆ యువకులందరూ పారిపోయారు. ఈ గ్రామానికి చెందిన చాలా మంది యువకులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లతో పాటు సాగర్, భింద్, మొరెనా, షియోపూర్ల ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ గ్రామంలో మొత్తం 3500 జనాభా ఉంటే వారిలో 1400 మంది ఆన్లైన్లో మోసాలతోనే లక్షలు సంపాదిస్తున్నారు. వీరందరిపై కేసులు ఉన్నాయి.
వీరిని అరెస్ట్ చేయడం ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఈ గ్రామం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. పోలీసులు వీరి కోసం వస్తున్నారని తెలిస్తే వేరే రాష్ట్రంలోకి వెళ్లిపోతారు. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను గ్రామస్తులందరూ కలిసి ఎదురిస్తారు. ఈ ఏడాది మే 19న ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేసి గాయపరిచారు. `జన జాగృతి అభియాన్ కింద ఒక టీమ్ని ఏర్పాటు చేసి ఇలాంటి నేరాలకు పాల్పడకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తాం. గ్రామానికి వెళ్లి స్థానికులతో సమావేశం నిర్వహించి వివరిస్తామ`ని నివారి ఎస్పీ టీకే విద్యార్థి తెలిపారు.