Shocking: తమిళనాడులో షాకింగ్ ఘటన.. ముగ్గురిని బలి తీసుకున్న ఫ్రిజ్!
ABN , First Publish Date - 2022-11-04T19:04:07+05:30 IST
ఇటీవలి కాలంలో పలు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగదారుల పాలిట యమపాశాల్లా మారుతున్నాయి. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ బైక్స్, టీవీలు పేలిపోయి ఎంతో మంది చనిపోయిన వార్తలను తరచుగా వింటున్నాం.
ఇటీవలి కాలంలో పలు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగదారుల పాలిట యమపాశాల్లా మారుతున్నాయి. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ బైక్స్, టీవీలు పేలిపోయి ఎంతో మంది చనిపోయిన వార్తలను తరచుగా వింటున్నాం. తాజాగా తమిళనాడులో ఓ ఫ్రిజ్ పేలిపోయి కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురై ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
చెంగల్పట్టు జిల్లా కోదండరామ్ నగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ నుంచి శుక్రవారం తెల్లవారు ఝామున పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. లోపలి నుంచి దట్టమైన పొగ బయటకు వచ్చింది. ఇరుగు పొరుగు వారు తలుపులు పగులకొట్టుకుని లోపలకు వెళ్లారు. రిఫ్రిజిరేటర్ పేలిపోయినట్టు గుర్తించారు. పేలుడు కారణంగా వ్యాపించిన పొగ వల్ల ఊపిరాడక గిరిజ, ఆమె చెల్లెలు రాధ, బంధువు రామ్ కుమార్ మృతి చెందారు. రామ్ కుమార్ భార్య భార్గవి, కూతురు ఆరాధన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్లోని కంప్రెషర్ పేలిపోయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.