నా కూతుర్ని ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడిన స్క్రీన్ ప్లే..

ABN , First Publish Date - 2022-09-19T00:06:11+05:30 IST

కొన్నిసార్లు కొందరు తమ తప్పులను కప్పి పుచ్చుకునే క్రమంలో సినిమా తరహా కథలను అల్లుతుంటారు. మరికొన్ని ఘటనల్లో సినిమా సీన్లను తలదన్నేలా ప్లానింగ్ వేస్తుంటారు. ఇలాంటి..

నా కూతుర్ని ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడిన స్క్రీన్ ప్లే..

కొన్నిసార్లు కొందరు తమ తప్పులను కప్పి పుచ్చుకునే క్రమంలో సినిమా తరహా కథలను అల్లుతుంటారు. మరికొన్ని ఘటనల్లో సినిమా సీన్లను తలదన్నేలా ప్లానింగ్ వేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో అసలు నిజం వెలుగులోకి వచ్చాక.. వామ్మో! అని నోరెళ్లబెడుతూ ఉంటాం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. నా కూతుర్ని ఎత్తుకెళ్లారంటూ ఓ మహిళ తన తల్లితో కలిసి వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇద్దరి మాటల్లో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించారు. దీంతో చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్‌కు చెందిన పింకీ అనే మహిళకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇప్పటికీ సంతానం లేకపోవడంతో అత్తింటి నుంచి అవమానాలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక సాకు చూపుతూ వేధిస్తుండడంతో కొన్ని నెలల క్రితం కాన్పూర్ లోని పుట్టింటికి వచ్చింది. చాలా కాలంగా ఇక్కడే ఉంది. అయితే ఎలాగైనా తన అత్తగారి ఇంట్లో పరువు నిలబెట్టుకోవాలని రోజూ ఆలోచించేది. ఈ క్రమంలో ఆమెకు ఓ ఐడియా వచ్చింది. బితూర్ అనే ప్రాంతానికి చెందిన ఓ మహిళ వద్ద నుంచి నెలల వయసున్న ఆడ శిశువును దత్తత తీసుకుంది. ఇటీవల పాపను తీసుకుని అత్తగారి ఇంటికి వెళ్లింది. తనకు బిడ్డ పుట్టిందంటూ అందరినీ నమ్మించింది. దీంతో భర్త, అత్తమామలు కూడా ఎంతో సంతోషించారు. అయితే కొన్ని రోజుల క్రితం పింకీ మళ్లీ పుట్టింటికి వచ్చింది.

స్నేహితులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువతి.. అన్నింటినీ కలిపి ప్రియుడికి పంపడంతో.. చివరకు..


అదే సమయంలో బితూర్ మహిళ పింకీ వద్దకు వచ్చి.. తమ బిడ్డ తమకు కావాలంటూ తీసుకెళ్లింది. దీంతో పింకీకి ఏం చేయాలో ఆర్థం కాలేదు. అత్తగారిని మళ్లీ ఎలా నమ్మించాలనే విషయంపై తీవ్రంగా ఆలోచించింది. చివరకు తల్లితో కలిసి పక్కా ప్లాన్ రెడీ చేసుకుని... శనివారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ‘‘చెవి నొప్పి రావడంతో తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్తుంటే.. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు నా పాపను బలవంతంగా ఎత్తుకెళ్లారు’’.. అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తల్లీకూతుళ్ల ప్రవర్తన, మాటల్లో తేడా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ వేర్వేరుగా విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దత్తతకు ఇచ్చిన మహిళను విచారించేందుకు బితూర్ వెళ్లారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎవరికీ అనుమానం రాకుండా.. భార్య మృతదేహంతో 500 కిలోమీటర్ల రైలు ప్రయాణం.. చివరగా పక్కనున్న వారు గమనించడంతో..



Updated Date - 2022-09-19T00:06:11+05:30 IST