rare stone: చేపలు పట్టేందుకు వెళ్లిన పిల్లలకు దొరికిన 6కిలోల అరుదైన రాయి.. చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు
ABN , First Publish Date - 2022-08-02T23:23:26+05:30 IST
వింతలు, విశేషాలు చోటు చేసుకునే సందర్భాల్లో పురాణ గాధలు చర్చకు వస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనతో ప్రజలు...
వింతలు, విశేషాలు చోటు చేసుకునే సందర్భాల్లో పురాణ గాధలు చర్చకు వస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనతో ప్రజలు రామాయణ (Ramayana) కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సీతాన్వేషణకు బయలుదేరిన రాముడు.. వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లేందుకు సముద్రంపై వారధి నిర్మించిన గాధ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కొందరు పిల్లలు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లగా.. వారికి 6కిలోల అరుదైన రాయి దొరికింది. ఈ రాయి రామాయణ కాలం నాటిదే అంటూ ప్రజలు పూజలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్పురి జిల్లా పరిధి అహ్మల్పూర్ గ్రామ పరిధిలో ఇసాన్ నది వద్ద జూలై 30న ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు పిల్లలు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆరు కిలోల బరువున్న నల్ల రాయి ఒకటి నీటిలో తేలుకుంటూ వచ్చింది. దాన్ని చూసి షాక్ అయిన వారు బయటికి తీసి, గ్రామంలోకి తీసుకొచ్చారు. ఆ రాయిపై జై శ్రీరామ్ అని రాసి ఉండడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి.. రాయికి పూజలు చేస్తున్నారు. అందరి సమక్షంలో ఆ రాయిని నీళ్లలో వేయగా తేలుతూ కనిపించింది. రామసేతు వంతెన సమయంలో వాడిన రాయి ఇదేనంటూ జనం చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ రాయిని ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.