mobile shocking news:మొబైల్ ఫోన్ రొమాంటిక్ మూడ్ ను చంపేస్తోందంటున్న సర్వేలు.. ఆధారాలు ఇవిగో..

ABN , First Publish Date - 2022-12-15T15:32:52+05:30 IST

భార్యాభర్తల మధ్య బంధాన్ని బలహీనం చేయడంలో మొబైల్స్ చాలా కీలకంగా మారాయంటున్నాయి సర్వేలు.

mobile shocking news:మొబైల్ ఫోన్ రొమాంటిక్ మూడ్ ను చంపేస్తోందంటున్న సర్వేలు.. ఆధారాలు ఇవిగో..

ఏకాంతంగా ఇద్దరూ ఉన్నప్పుడు ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ రొమాంటిక్ గా ముద్దు పెట్టుకోవడానికో లేదా ప్రేమపూర్వక కౌగిలి ఇవ్వడానికో సిద్దపడ్డప్పుడు పాకెట్ లో ఉన్న మొబైల్ 'టింగ్..' మని సౌండ్ చేస్తుంది. నోటిఫికేషన్ సౌండ్ వినబడగానే తాము ఏ పరిస్థితిలో ఉన్నాం అనే విషయం మరచిపోయి మరీ మొబైల్ వైపు దృష్టి పెట్టేస్తున్నారు చాలామంది. ప్రస్తుతకాలంలో భార్యాభర్తల మధ్య ఎక్కువగా జరుగుతున్న విషయం ఇది.

టెక్నాలజీ పెరిగాక ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ కామన్ అయిపోయాయి. అయితే ఈ మొబైల్స్ ను ప్రస్తుతం చాలా అతిగా వాడుతున్నారనే మాట అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. తింటున్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, చివరకు బాత్రూమ్ లోకి కూడా మొబైల్ తీసుకెళ్లే ఉద్దండులు ఉన్నారు. అయితే మిగతా విషయాల మాటేమిటో కానీ భార్యాభర్తల మధ్య బంధాన్ని బలహీనం చేయడంలో మొబైల్స్ చాలా కీలకంగా మారాయంటున్నాయి సర్వేలు. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే...

మొబైల్ ఫోన్ వాడకం వల్ల భార్యాభర్తల మధ్య వ్యక్తిగత సమయం తక్కువైపోతోందట. ప్రస్తుతకాలంలో అయితే ఎంతో ముఖ్యమైన వేడుకలు అయిన నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు లాంటి సందర్భాలలో కూడా వధూవరులు మొబైల్ ఫోన్స్ పట్టుకుని ఉండటం గమనిస్తూనే ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్ళైన వారి మధ్య రొమాంటిక్ మూడ్ ను మొబైల్స్ కిల్ చేస్తున్నాయిప్పుడు. రోజులో దొరికే కాసింత వ్యక్తిగత సమయాన్ని మొబైల్స్ కే కేటాయిస్తుండం దీనికి ప్రధాన కారణం. భార్యభర్తలు ఇద్దరూ గడిపే కొద్దిపాటి ఏకాంత సమయంలో మొబైల్ ఫోన్ ను తమతోనే ఉంచుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఆశించినంతగా కమ్యూనికేషన్ సాగడంలేదు.

మొబైల్ ఫోన్ లో లీనమైపోయిన భాగస్వామిని పలకరించినపుడు విసుక్కోవడం, కోపం చేసుకోవడం, చెబుతున్న విషయానికి యాంత్రికంగా తల ఊపడం, చెప్పింది సరిగా వినకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటి కారణంగా భాగస్వాముల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎంతో సంతోషంగా గడపాల్సిన ఏకాంత సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల ఒకరిపట్ల మరొకరికి ఉండాల్సిన ఏకాగ్రత, ఆసక్తి మొబైల్ వైపుకు ఎంతో సులువుగా మారిపోతుంది. ప్రతి ఒక్కరికీ తమ భాగస్వామి తమతో ఇలా ఉండాలి అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి నిజం కాకుండా తమను వెక్కిరించినపుడు ఇలాంటి బంధం అవసరమా అనే ప్రమాదకరమైన ఆలోచనలు కూడా కలుగుతాయి కొందరిలో. ఈ కారణంగానే ప్రస్తుతకాలంలో బంధాలు బలహీనంగా ఉంటున్నాయి.

భాగస్వాముల కంటే మొబైల్ ఫోన్స్ కు ప్రాధ్యాన్యత ఇస్తున్నవారు ఎక్కువ మందే ఉన్నారు. భాగస్వామితో కంటే మొబైల్స్ లో మాట్లాడటానికి ఆసక్తి చూపేవారు కూడా చాలామంది ఉన్నారు. దీనికి కారణం కొందరు భాగస్వాములు అస్తమానం ఏదో ఒక విషయానికి గొడవపడటం లేదా కంప్లైంట్ చేయడం వంటివి చేస్తారు. వాటి నుండి తప్పించుకునే ధోరణిలో కొందరు మొబైల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక సోషల్ మీడియా వల్ల మారిపోయే మూడ్స్ ను ఇంట్లో కుటుంబ సభ్యుల మీద చూపించేవారు ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా ఉంటున్నారు. ఈ కారణంగా మానవ సంబంధాలు కూడా బలహీనపడుతున్నాయి. దాదాపు 90శాతం మంది దంపతులు తాము తమ భాగస్వాములతో ఉన్నప్పుడు మొబైల్ వాడుతున్నామని, మొబైల్ నోటిఫికేషన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని ఒప్పుకున్నారు. కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్టు మొబైల్ ఫోన్ అతిగా వాడటం వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా బాగస్వాముల మద్య ఈ మొబైల్స్ చిచ్చు పెట్టేస్తున్నాయి. 'అతి సర్వత్ర వర్జయేత్' అని మన పెద్ద వాళ్ళు ఊరికనే చెప్పలేదు.

Updated Date - 2022-12-15T15:32:53+05:30 IST