Delhi Liquor Scam: తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు బిగుస్తోన్న ఉచ్చు
ABN , First Publish Date - 2022-11-16T19:00:40+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) త్వరలో సంచలనాలు వెలుగులోకి రానున్నాయి.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi Liquor Scam) త్వరలో సంచలనాలు వెలుగులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తులో భాగంగా అధికారులకు కీలక సమాచారం, ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో బేగంపేట్ ఎయిర్పోర్టుకు లింక్, ప్రైవేట్ చార్టెర్డ్ విమానాల ద్వారా పెద్ద ఎత్తున నగదు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు తరలించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల అండతో డబ్బు తరలించినట్లు అనుమానం వ్యక్తం చేసింది. లిక్కర్ స్కామ్ సూత్ర, పాత్రధారులతో పాటు రాజకీయ ప్రముఖల పాత్రపై నిగ్గు తేల్చే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. బేగంపేట్ ఎయిర్పోర్టుకు ప్రైవేట్ చార్టెర్డ్ విమానాలు వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు. కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల రాకపోకలపై వివరాలు కోరుతూ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి సతీమణి కనికారెడ్డి ఉన్నారు. ఇండో పసిఫిక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ను జెట్ సెట్ గో సంస్థ టేకోవర్ చేసింది.
జెట్ సెట్ గో ద్వారా ప్రైవేట్ విమాన కార్యకలాపాలను కనికారెడ్డి నిర్వహిస్తున్నారు. కనికారెడ్డి కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు,.. అందులో ప్రయాణించినవారి వివరాలివ్వాలని గత నెల 17న ఈడీ లేఖ రాసింది. ఈడీ లేఖను దేశంలోని అన్ని ఎయిర్పోర్టు డైరెక్టర్లకు ఏఏఐ పంపింది. కనికారెడ్డికి చెందిన విమానాల్లో కీలక వ్యక్తులు, ప్రముఖులు ప్రయాణాలు సాగించినట్లు ఈడీ నిర్ధారించింది. కనికారెడ్డికి చెందిన విమానాలనే తరచుగా విజయసాయిరెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, కీలక నేతలు వాడుతున్నారు. కనికారెడ్డి విమానాల్లోనే రాజకీయ ప్రముఖులు ప్రయాణించినట్లు ఆధారాలు లభించాయి. ఏపీ నేతలు ఎవరికి ఫ్లైట్ అవసరమైనా సమకూర్చేది కనికారెడ్డే అని సమాచారం అందింది. చార్టెర్డ్ విమానాలకు అధిక అద్దెలు వసూలు చేసినట్లు కనికారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్లో ఏపీకి చెందిన అత్యున్నత స్థాయి నేత ఉన్నట్టు విచారణ సంస్థలు అనుమానాలు వ్యక్తం చేశాయి.