తాల్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు

ABN , First Publish Date - 2022-11-28T08:06:44+05:30 IST

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో 14వ బాలల దినోత్సవం ఈ నెల 26న ఘనంగా జరిగింది. 300 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో..

తాల్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు

ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో 14వ బాలల దినోత్సవం ఈ నెల 26న ఘనంగా జరిగింది. 300 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. తాల్ సాంస్కృతిక కేంద్రం విద్యార్థులతో పాటు, లండన్, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది బాలలు వివిధ కళలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. సాంప్రదాయ, భక్తి, సినీ సంగీత నృత్య గీతాలు, చిత్రలేఖనము, ఫాన్సీ డ్రెస్ కాంపీటీషన్‌తోపాటు పలు రకాల వాయిద్య ప్రదర్శనలు ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకున్నాయి. 5 గంటలకుపైగా జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూకే ఎంపీ సీమా మల్హోత్రా హాజరయ్యారు. తాల్ ఏటా నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలను కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు ఆటవిడుపుగా ఉండి ఉత్సాహాన్ని కలిగించడంతోపాటు భావితరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు సహాయపడతాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిని అభినందించారు. ఇదే కార్యక్రమంలో ఒక చిన్నారి బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్‌ చేయగా.. దానికి కొనసాగింపుగా కొందరు ఆడ పడుచులతో పాటు ఎంపీ సీమా మల్హోత్రా కూడా స్టెప్పులేశారు.

Untitled-3.jpg

తాల్ ఛైర్మన్ భారతి కందుకూరి పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాల్ సాంస్కృతిక కేంద్రాలలో తమ పిల్లలను చేర్పించి, భావితరాలకు తెలుగు భాష మరియు సంస్కృతిని అందించేలా సహకరించాలని కోరారు. సంస్థ  చేపట్టే ప్రతీ కార్యక్రమంలో తమ వంతు సహకారాన్నిఅందిస్తున్న తల్లిదండ్రులు, తాల్ సభ్యులు మరియు కార్యకర్తలకు తాల్ ఛైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ట్రస్టీ గిరిధర పుట్లూర్ మాట్లాడుతూ.. తాల్ సాంస్కృతిక కేంద్రం (TCC) నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వివరాలు తెలిపారు. TCCలో చేరి తెలుగు నేర్చుకుంటున్న జూలీ ల్యూఆంకో అనే విదేశీ మహిళ తెలుగు పద్యాలను చెప్పటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాల్ బాలల దినోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన శ్రీదేవి అల్లెద్దుల, అనిల్ రెడ్డి, దివ్య రెడ్డి, సునీత అరిగే, సుజాత గాదంసేతి, భారతి సుదనగుంట, హరిణి గెడ్డం, అశోక్ మాడిశెట్టి, జ్యోతి కస్తూరి, స్వాతి మేడిశెట్టి, రాయ్ బొప్పన్న, రిషి తదితరులకు కల్చరల్ ట్రస్టీ నవీన్ గాదంసేతి కృతఙ్ఞతలు తెలియజేశారు. వైస్ ఛైర్మన్ రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు అనిల్ అనంతుల, కిషోర్ కస్తూరి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, అనిత నోముల ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్జే శ్రీవల్లి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Updated Date - 2022-11-28T08:16:19+05:30 IST