Visa: భారత్ వచ్చే బ్రిటన్ ప్రయాణికులకు తీపి కబురు..!

ABN , First Publish Date - 2022-12-06T13:16:30+05:30 IST

లండన్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission) సోమవారం కీలక ప్రకటన చేసింది.

Visa: భారత్ వచ్చే బ్రిటన్ ప్రయాణికులకు తీపి కబురు..!

ఎన్నారై డెస్క్: లండన్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission) సోమవారం కీలక ప్రకటన చేసింది. బ్రిటన్ ప్రయాణికుల కోసం ఎలక్ట్రానిక్ వీసాలను (e-Visas) పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి నెలల్లో ఇండియాకు వీసాల కోసం భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా యూకేలోని (UK) భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ.. ఈ సర్వీస్ వెంటనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. "ఈరోజు పెద్ద వార్త ఏమిటంటే, మేము మరోసారి ఇ-వీసాలను పునరుద్ధరిస్తున్నాము. ఇది యూకే నుండి ఇండియాకు చాలా సులభంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది" అని దొరైస్వామి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

ఇక ఈ వారం నుంచి ప్రయాణికులు భారతదేశానికి ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని లండన్‌లోని హైకమిషన్ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం సిస్టమ్ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతోందని, భారతీయ వీసా వెబ్‌సైట్ త్వరలో ఈ-వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కాగా, భారత హైకమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బ్రిటన్ స్పందించింది. గత నెలలో ఇండోనేషియాలో జరిగిన G20 సమ్మిట్ (G20 Summit) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ (Rishi Sunak) మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలలో ఇ-వీసాలు ఉన్నాయని యూకే పార్లమెంట్‌లో పేర్కొంది.

Updated Date - 2022-12-06T13:16:32+05:30 IST