FIFA World Cup 2022: ప్రత్యేకంగా తెలుగు పాటను రిలీజ్ చేసిన ఆంధ్ర కళా వేదిక

ABN , First Publish Date - 2022-11-28T09:19:10+05:30 IST

ఫుట్‌బాల్ (ఫిఫా) చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా తెలుగు పాటతో ‘ఫిఫా 2022’ నిర్వహిస్తున్న ఆతిథ్య ఖతార్ దేశానికి కృతజ్ఞతాపూర్వకంగా..

FIFA World Cup 2022: ప్రత్యేకంగా తెలుగు పాటను రిలీజ్ చేసిన ఆంధ్ర కళా వేదిక

ఎన్నారై డెస్క్: ఫుట్‌బాల్ (ఫిఫా) చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా తెలుగు పాటతో ‘ఫిఫా 2022’ నిర్వహిస్తున్న ఆతిథ్య ఖతార్ దేశానికి కృతజ్ఞతాపూర్వకంగా ఆంధ్ర కళావేదిక ఖతార్, శుభోదయం గ్రూప్ సహకారంతో తెలుగు పాటను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారి రాక ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చిందన్నారు. తమ కార్యవర్గం అతి తక్కువ (10 రోజుల) వ్యవధిలో ఇంతటి బృహత్కార్యానికి పూనుకొని అరుదైన రికార్డు సృష్టించడంలో కృతకృత్యులు అయ్యాయని తెలిపారు. ఫిఫా 2022 పోటీలు నిర్వహించే 8 స్టేడియాలు, ఖతార్‌లోని చారిత్రాత్మక, ప్రముఖ కట్టడాలు, అరబ్ దేశాల ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా ఈ పాటను చిత్రీకరించినట్టు తెలిపారు. ఇందుకోసం సహకరించిన శుభోదయం మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పాట కోసం అద్భుతమైన సాహిత్యాన్ని ప్రత్యేకించి అరబీ భాష పదాలను అందించిన తనికెళ్ల శంకర్‌, సంగీతాన్ని సమకూర్చిన మాధవపెద్ది సురేష్, గాత్రంతో పాటకు మరింత వన్నె ఎస్పీ చరణ్, హరిణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అంతేకాకుండా ఈ పాట చిత్రీకరణకు మరియు ఎడిటింగ్‌కు తమ సహకారాన్ని అందించిన జగదీశ్ అల్లం, గోవర్ధన్ అమూరుకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పాట చిత్రీకరణలో ముఖ్య భూమిక పోషించిన విక్రమ్ సుఖవాసికి, పాట సాహిత్యం కోసం కృషి చేసిన వీబీకే మూర్తి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలుగు వారి ఖ్యాతిని మరింత పెంచేలా రూపొందించిన ఈ పాటను ప్రపంచంలోని తెలుగు సంఘాలు, తెలుగు వారందరూ ఇతరులకు షేర్ చేస్తూ పాటకు తగిన గుర్తింపు వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శుభోదయం గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లయన్ Dr లక్ష్మి ప్రసాద్ కలపటపు, తనికెళ్ల భరణి, సాయి కుమార్ , తనికెళ్ల శంకర్, విక్టర్ అమల్రాజ్, TANA అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, TANA కల్చరల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, వీధి అరుగు నార్వే అధ్యక్షులు వెంకట్ తరిగోపుల, సాంస్కృతిక కళా సారధి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, మలేషియా తెలుగు సంఘం నుంచి సత్య మల్లుల, హాంగ్ కాంగ్ నుంచి జయ పీసపాటి, నైజీరియా తెలుగు సంఘం నుంచి ప్రవీణ్, తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపికా రావి, తెలుగు కళా సమితి ఒమాన్ కన్వినర్ అనిల్ కుమార్, తెలుగు కళా సమితి బహ్రెయిన్ శివ యెల్లపు, ఎం.బి.రెడ్డి, కువైట్ నుంచి లలిత ధూళిపాళ, అఖిల భారత తెలుగు సేన నుంచి PSN మూర్తి, ప్రయాగ శర్మ, విజయ భాస్కర్ దీర్గాశి, జిజ్ఞాస భార్గవ్, శివ శంకర్, ప్రముఖ ఛానల్ అధినేత సురేష్ బాసంగి, క్రీడాకారుడు కార్తీక్ యనమండ్ర, ఖతార్ నుంచి ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) సలహా మండలి ఛైర్మన్ KS ప్రసాద్, జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, ఆంధ్ర కళా వేదిక సలహా మండలి ఛైర్మన్ సత్యనారాయణ మలిరెడ్డి, గొట్టిపాటి రమణయ్య, దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ఫౌండర్ సయెద్ రఫీ, ప్రసాద్ ఇంద్రగంటి, శుభోదయం మీడియా సీఈఓ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా మట్లాడుతూ.. తెలుగు వారి గౌరవాన్ని ఖండాతరాలు వ్యాపింప చేసేలా ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకుగానూ ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని కొనియాడారు.

Updated Date - 2022-11-28T09:19:20+05:30 IST