WhatsApp : తప్పుడు ఇండియా మ్యాప్ పెట్టిన వాట్సాప్ సీఈఓ... ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి...
ABN , First Publish Date - 2022-12-31T18:41:22+05:30 IST
సరైనది కానటువంటి భారత దేశ మ్యాప్ను పోస్ట్ చేసిన వాట్సాప్పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : సరైనది కానటువంటి భారత దేశ మ్యాప్ను పోస్ట్ చేసిన వాట్సాప్పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశంలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో, వ్యాపారాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారో, ఆ దేశానికి చెందిన సరైన మ్యాప్ను ఉపయోగించాలని హితవు పలికారు. సాధ్యమైనంత త్వరగా ఈ పొరపాటును సరిదిద్దాలని కోరారు.
మెటా యాజమాన్యంలోని వాట్సాప్, జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ (Zoom CEO Eric Yuan) ఇటీవల తన ట్విటర్ హ్యాండిల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానిలో పెట్టిన భారత దేశ మ్యాప్ జమ్మూ-కశ్మీరు విషయంలో పొరపాటుగా ముద్రితమైంది. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) స్పందిస్తూ శనివారం ఇచ్చిన ట్వీట్లో, భారత దేశ మ్యాప్ విషయంలో జరిగిన పొరపాటును సాధ్యమైనంత త్వరగా సరిదిద్దాలని వాట్సాప్ను కోరారు. భారత దేశంలో వ్యాపారం చేస్తున్న అన్ని వేదికలు, అదేవిధంగా భారత దేశంలో వ్యాపారాన్ని కొనసాగించాలని కోరుకుంటున్న అన్ని ప్లాట్ఫామ్స్ తప్పనిసరిగా సరైన మ్యాప్లను ఉపయోగించాలని తెలిపారు.
రాజీవ్ చంద్రశేఖర్ అంతకుముందు ఇచ్చిన ట్వీట్లో, ఏయే దేశాల్లో వ్యాపారం చేస్తున్నారో, చేయాలనుకుంటున్నారో, ఆయా దేశాలకు చెందిన సరైన మ్యాప్లను ఉపయోగిస్తున్నట్లు నిర్థరించుకోవాలని తెలిపారు.
దీంతో యువాన్ స్పందించి, తన అధికారిక ఖాతా నుంచి వివాదాస్పద ట్వీట్ను తొలగించారు. మ్యాప్ విషయంలో సమస్యలు ఉన్నాయని చాలా మంది అభ్యంతరాలను లేవనెత్తడంతో తాను తన ట్వీట్ను తొలగించానని తెలిపారు. సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.