Classrooms Scam : కేజ్రీవాల్‌కు మరో షాక్... తరగతి గదుల నిర్మాణంపై దర్యాప్తునకు సిఫారసు...

ABN , First Publish Date - 2022-11-25T11:09:16+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మరో ఎదురు దెబ్బ తగిలింది.

Classrooms Scam : కేజ్రీవాల్‌కు మరో షాక్... తరగతి గదుల నిర్మాణంపై దర్యాప్తునకు సిఫారసు...
Arvind Kejriwal

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే మద్యం కుంభకోణం (Liquor Scam)లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆప్ నేతలకు విజిలెన్స్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో రూ.1,300 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని ఆరోపించింది. దీనిపై ప్రత్యేక నైపుణ్యంగల సంస్థ చేత దర్యాప్తు చేయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది.

ఢిల్లీ రాష్ట్రంలోని 193 పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని విజిలెన్స్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ అక్రమాలకు విద్యా శాఖ, ప్రజా పనుల శాఖలలోని అధికారుల్లో ఎవరు బాధ్యులో నిర్ణయించాలని చీఫ్ సెక్రటరీకి పంపిన నివేదికలో కోరింది. టెండరు ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని, ప్రైవేటు వ్యక్తులు, బబ్బర్ అండ్ బబ్బర్ అసోసియేట్స్ ప్రమేయం ఎక్కువగా ఉందని తెలిపింది. అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి చాంబర్‌లో జరిగిన సమావేశంలో బబ్బర్ అంఃడ్ బబ్బర్ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారని, అధికారికంగా కన్సల్టెంట్‌గా నియమించకపోయినప్పటికీ ఈ సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపింది. టెండరు తర్వాత కూడా మార్పుల కోసం మంత్రిపై ప్రభావం చూపించారని తెలిపింది. దీనివల్ల అదనంగా రూ.205.45 కోట్లు ఖర్చు చేయవలసి వచ్చిందని పేర్కొంది. రాజ్యాంగేతర సంస్థలు పరిపాలనను నడుపుతున్నాయని, అధికారులకు నియమ, నిబంధనలను నిర్దేశించాయని తెలిపింది. ప్రైవేటు వ్యక్తుల ఆదేశాలను అన్ని స్థాయుల్లోనూ అమలు చేశారని పేర్కొంది. దీనివల్ల భద్రతపరమైన విషయాలకు ముప్పు జరగడంతోపాటు, పరిపాలనపరమైన అరాచకం ప్రబలుతుందని వివరించింది.

పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఈ తరగతి గదులను నిర్మించింది. ఈ పనుల్లో అక్రమాలు జరిగాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (Central Vigilance Commission) 2020 ఫిబ్రవరి 17న ఇచ్చిన నివేదికలో పేర్కొంది. దీనిపై అభిప్రాయాలను తెలియజేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్‌ను కోరింది.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 2015 ఏప్రిల్‌లో ఆదేశించారు. ఈ బాధ్యతను ప్రజా పనుల శాఖకు అప్పగించారు. ఈ శాఖ ఓ సర్వేను నిర్వహించి, 7,180 తరగతి గదులు అవసరమని తెలిపింది. వాస్తవానికి అవసరమైనవి 2,405 గదులు మాత్రమేననే ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2022-11-25T11:09:21+05:30 IST