Red alert: తమిళనాడులో రెడ్ అలెర్ట్!
ABN , First Publish Date - 2022-12-06T20:26:34+05:30 IST
తమిళనాడులో ఈ నెల 8న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణశాఖ (IMD) రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్
చెన్నై: తమిళనాడులో ఈ నెల 8న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణశాఖ (IMD) రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కుండపోత వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి బలపడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో భారీ వర్షాలతోపాటు బలమైన గాలులు వీస్తాయని వివరించింది.
ఈ జిల్లాల్లో రెడ్ అలెర్ట్
విల్లుపురం, చెంగల్పట్టు, కడలూర్, కాంచీపురం, తిరువళ్లూర్, అరియలూర్, పెరంబలూర్, చెన్నై, కళ్లకురిచి, మైలాడుతురై, తంజావూర్, తిరువారూర్, నాగపట్టణం జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బుధవారం (7న) తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, 8న ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే, విల్లుపురం, కడలూర్, మైలాడుతురై, తంజావూర్, తిరువారూర్, నాగపట్టణం, పుదుకొట్టై జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఐఎండీ హెచ్చరికల నేపథ్యలో నాగపట్టణం, తంజావూర్, తిరువారూర్, కడలూర్, మైయిలాడుతురై, చెన్నైలలో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.