Parliament : రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-12-13T12:45:37+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ వద్ద చైనా సైనికులు ఘర్షణకు దిగిన అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Parliament : రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన
Rajnath Singh

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ వద్ద చైనా సైనికులు ఘర్షణకు దిగిన అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం పార్లమెంటులో మాట్లాడారు. యాంగ్‌త్సే ప్రాంతంలో యథాతథ స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని, దీనిని మన రక్షణ దళాలు దీటుగా తిప్పికొట్టాయని చెప్పారు. 2022 డిసెంబరు 9న జరిగిన ఈ సంఘటనలో భారతీయ సైనికులు ఎవరూ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఎటువంటి అతిక్రమణలనైనా దీటుగా ఎదుర్కొనే సత్తా భారత సైన్యానికి ఉందన్నారు.

చైనా దళాల ప్రయత్నాన్ని మన దళాలు దృఢ సంకల్పంతో ఎదిరించాయని చెప్పారు. ఈ ఘర్షణలో భౌతిక, శారీరక పోరాటం జరిగిందని చెప్పారు. పీఎల్ఏ దళాలు మన దేశ భూభాగంలోకి చొరబడకుండా మన సైనికులు ధైర్యసాహసాలతో నిలువరించారని చెప్పారు. పీఎల్ఏ దళాలు తిరిగి తమ స్థావరాలకు వెళ్ళిపోయే విధంగా చేశారని చెప్పారు. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారన్నారు. భారత సైనికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడటం కానీ, ప్రాణాలు కోల్పోవడం కానీ జరగలేదని సభకు స్పష్టం చేస్తున్నానని తెలిపారు. ఇండియన్ మిలిటరీ కమాండర్స్ సకాలంలో జోక్యం చేసుకుని పీఎల్ఏ సైనికులు తిరిగి వెళ్ళిపోయేలా చేశారన్నారు. మన దళాలు మన దేశ సరిహద్దులను కాపాడటానికి నిబద్ధతతో కట్టుబడి ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లోని యథాతథ స్థితిని సవాల్ చేసి, మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొట్టడానికి మన దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చైనా సైనికులు ఘర్షణకు దిగడం గురించి చైనా వద్ద దౌత్య మార్గాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు.

స్థానిక ఇండియన్ మిలిటరీ కమాండర్ డిసెంబరు 11న చైనీస్ మిలిటరీ కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, చర్చలు జరిపారని తెలిపారు. మన రక్షణ దళాల ధైర్య సాహసాలకు పార్లమెంటు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆశిస్తున్నానన్నారు. భారత దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడే సత్తా మన సైన్యానికి ఉందన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలకు గౌరవ వందనం చేస్తున్నామన్నారు. గెలిచే అవకాశం చైనాకు ఇవ్వబోమని హామీ ఇస్తున్నానని చెప్పారు.

రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.

భారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, వాస్తవాధీన రేఖ వెంబడి తవంగ్ ప్రాంతంలో చైనా సైనికులు స్పైక్‌డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై డిసెంబరు 9న దాడి చేశారు. ఇరు దేశాల సైనికులు స్వల్పంగా గాయపడ్డారని భారత సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో ఆరుగురు భారత సైనికులు గాయపడ్డారని, వారిని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపింది. చైనా సైనికులు ఎక్కువ మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-12-13T12:55:54+05:30 IST