Public Sector Banks : ప్రభుత్వ రంగ బ్యాంకుల దశ తిరిగింది

ABN , First Publish Date - 2022-11-11T13:10:15+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ స్టేట్ బ్యాంక్

Public Sector Banks : ప్రభుత్వ రంగ బ్యాంకుల దశ తిరిగింది
Nirmala Sitharaman

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో రూ.13,264.52 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుకు రూ.6,547 కోట్లు నికర నష్టం వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ప్రభుత్వ రంగంలోని 12 బ్యాంకులు ప్రస్తుతం లాభాల బాట పడుతుండటం శుభ పరిణామం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధిపత్యంగల భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వం వేసిన ముఖ్యమైన మొట్టమొదటి అడుగు 2015 ఏప్రిల్‌లో అసెట్ క్వాలిటీ రివ్యూ (AQR)ను ప్రారంభించడమని నిపుణులు చెప్తున్నారు. పైకి కనిపించని నిరర్థక ఆస్తులు (NPAs)ను గుర్తించడం కోసం ఈ సమీక్షను ప్రారంభించారని, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్తున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) నవంబరు 7న ఇచ్చిన ట్వీట్‌లో, నిరర్థక ఆస్తులను తగ్గించడానికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల స్తోమతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం చేస్తున్న కృషి వల్ల ఇప్పుడు సత్ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులు ఉన్నాయని, ఇవన్నీ 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.25,685 కోట్లు నికర లాభాలను ప్రకటించాయని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో ఈ బ్యాంకులు మొత్తం రూ.40,991 కోట్లు నికర లాభాలను ప్రకటించాయని వివరించారు. ఇయర్ ఆన్ ఇయర్ లాభాలు రెండో త్రైమాసికంలో 50 శాతం, మొదటి అర్ధ సంవత్సరంలో 31.6 శాతం వృద్ధి చెందాయన్నారు.

ఈ కాలంలో ఎస్‌బీఐ నికర లాభం 75 శాతం పెరిగింది. అదేవిధంగా కెనరా బ్యాంక్ నికర లాభం 89 శాతం (రూ.2,525 కోట్లు) పెరిగింది. యూకో బ్యాంకు నికర లాభం రూ.504 కోట్లు అంటే 145 శాతం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం 58.7 శాతం పెరిగింది, అంటే రూ.3,312.42 కోట్లు ఆర్జించింది. రూ.1,225 కోట్ల నికర లాభంతో ఇండియన్ బ్యాంకు 12 శాతం వృద్ధిని చూపించింది.

Updated Date - 2022-11-11T13:10:19+05:30 IST