Cable Bridge Collapse: మోర్బీ ఘటనా స్థలిని సందర్శించిన మోదీ

ABN , First Publish Date - 2022-11-01T17:09:53+05:30 IST

మోర్బీ: గుజరాత్‌ మోర్బీలో తీగల వంతెన కూలిన ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

Cable Bridge Collapse: మోర్బీ ఘటనా స్థలిని సందర్శించిన మోదీ
PM Modi visits Morbi bridge collapse site

మోర్బీ: గుజరాత్‌ మోర్బీలో తీగల వంతెన కూలిన ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ప్రధాని పరామర్శించారు. సహాయక చర్యలు చేపట్టిన వారితో కూడా మోదీ మాట్లాడారు. ఆ తర్వాత మోర్బీ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ప్రధాని సమీక్ష జరిపారు.

ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ చెప్పారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆయన మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్‌షోను, వర్చువల్‌ ‘పేజ్‌ కమిటీ సమ్మేళన్‌’ను ప్రధాని ఇప్పటికే రద్దు చేసుకున్నారు.

మరోవైపు ఘటనలో మృతుల సంఖ్య 135కి చేరిందని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని.. మరో వంద మంది మృతదేహాలు నది అడుగుభాగంలో ఉన్న బురదలో కూరుకుపోయి ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వంతెన కూలిన వెంటనే.. గల్లంతైనవారి కోసం రాష్ట్ర, జాతీయ విపత్తు సహాయక బృందాలు గాలింపు ప్రారంభించినప్పటికీ.. చీకటి వల్ల కష్టంగా మారింది. దీంతో సోమవారం ఉదయాన్నే గాలింపును కొనసాగించారు. కాగా.. ఈ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ విడుదలైంది. బ్రిడ్జిపై ఉన్న కొంత మంది వ్యక్తులు సెల్ఫీలు తీసుకుంటుండగా.. మధ్యభాగంలో ఉన్నవారు ఆ వంతెనను అటూఇటూ ఊపేందుకు ప్రయత్నించడంతో అప్పటికే బరువును తట్టుకోలేకపోయిన బ్రిడ్జి కుప్పకూలిపోయిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 125 మందిని మాత్రమే మోయగలిగే సామర్థ్యం ఉన్న ఆ వంతెనపైకి 500 మంది చేరడమే కాక.. దాన్ని ఊపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మరోవైపు.. నిర్లక్ష్యంతో ఈ ప్రమాదానికి కారకులుగా భావిస్తూ 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

మరమ్మతులు చేపట్టిన సంస్థలపై ఐపీసీ సెక్షన్‌ 304, 308 కింద కేసులు నమోదు చేశారు. సాంకేతిక, నిర్మాణ లోపాలు, నిర్వహణ సమస్యేలే ప్రమాదానికి కారణమని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిర్వాహకులు మరమ్మతులు సరిగ్గా చేయలేదని నాణ్యత పరీక్షలు కూడా చేపట్టలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసినవారిలో ఒరేవా కంపెనీ మేనేజర్లు ఇద్దరు, మరో ఇద్దరు టికెట్‌ విక్రేతలు, ఇద్దరు మరమ్మతు కాంట్రాక్టర్లు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. నిందితుల్లో కంపెనీ పెద్దలెవరూ లేకపోవడం గమనార్హం.

ఈ బ్రిడ్జి మరమ్మతుల బాధ్యతను 2022 నుంచి 2037 వరకు ఒరేవా అనే వాచ్‌ల తయారీ కంపెనీకి చెందిన అజంతా మాన్యుఫాక్చరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు మోర్బీ మునిసిపాలిటీ అప్పజెప్పింది. మరమ్మతులు చేయాల్సిన ఆ సంస్థ సాంకేతిక పనులను ‘దేవ్‌ప్రకాశ్‌ సొల్యూషన్స్‌’ అనే మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి కట్టబెట్టింది. ఈ ఏడాది మార్చిలో మరమ్మతులు మొదలుపెట్టి అక్టోబరు 26న పునరుద్ధరించింది. ఒప్పందం మే రకు మరమ్మతుల ఖర్చులను రాబట్టుకునేందుకు సందర్శకుల నుంచి రూ.17 చొప్పున టికెట్‌ వసూలు చేస్తోంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండానే బ్రిడ్జిని పునరుద్ధరించారని మోర్బీ మున్సిపల్‌ చైర్మన్‌ సందీ్‌పసింగ్‌ జాలా వ్యాఖ్యలపై ఒరేవా సంస్థ స్పందించలేదు.

వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌ కుందరియా కుటుంబసభ్యులు 12 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు చిన్నపిల్లలు, నలుగురు మహిళలు. ఆటవిడుపుగా వంతెన వద్దకు వెళ్లినవారంతా నీటమునిగి దుర్మరణం పాలయ్యారు. తన పెద్దన్న బావమరిది కుమార్తెలు, వారి భర్తలు, ఐదుగురు పిల్లలు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-01T17:09:55+05:30 IST