BJP Gujarat : బీజేపీ విజయం వెనుక పక్కాప్రణాళిక

ABN , First Publish Date - 2022-12-09T01:29:13+05:30 IST

ఈ ఎన్నికలను మినహాయిస్తే గుజరాత్‌లో బీజేపీకి ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక సీట్లు.. 2002 ఎన్నికల్లో 127. గోద్రా అనంతర అల్లర్లు జరిగిన తర్వాత వచ్చిన

BJP Gujarat : బీజేపీ విజయం వెనుక పక్కాప్రణాళిక

గుజరాత్‌లో బలహీనతలను గుర్తించి.. మార్చుకున్న కమల నాథులు

భూపేంద్రపటేల్‌ను సీఎం చేసిన మోదీ

కాంగ్రెస్‌ బలంగా ఉన్న సీట్లపైనే గురి

ఈడబ్ల్యూఎస్‌ కోటాతో బీజేపీలోకి పాటీదార్లు

పాత రికార్డులు బ్రేక్‌

ఈ ఎన్నికలను మినహాయిస్తే గుజరాత్‌లో బీజేపీకి ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక సీట్లు.. 2002 ఎన్నికల్లో 127. గోద్రా అనంతర అల్లర్లు జరిగిన తర్వాత వచ్చిన ఎన్నికలవి. అప్పుడు కూడా సాధించనన్ని సీట్లను ఈసారి గెలుచుకోవడం ద్వారా బీజేపీ ఆ రికార్డునే కాదు.. 1985లో కాంగ్రెస్‌ పేరిట ఉన్న 149 సీట్ల రికార్డును కూడా బద్దలుకొట్టింది.

ఎప్పుడూ గెలవని చోటా విజయఢంకా

గుజరాత్‌ రాష్ట్రం బీజేపీకి ఇరవై ఏడేళ్లుగా బీజేపీ కంచుకోట! కొన్నిసార్లు ఎక్కువ సీట్లు గెలిచి ఉండొచ్చు.. కొన్నిసార్లు తక్కువ మెజారిటీతో బయటపడి ఉండొచ్చు. కానీ, ఆ రాష్ట్రం మీద పట్టు మాత్రం రెండున్న దశాబ్దాలుగా ఆ పార్టీకే ఉంది. ఇంత పట్టు ఉన్నా.. బీజేపీకి కొరుకుడుపడని, ఈ ఇరవైఏడేళ్లలో కమలనాథులు ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు ఏడు ఉన్నాయి! అవి.. బోర్సద్‌, ఝగాడియా, వ్యారా, మహుధా, అంక్లవ్‌, దనిలిండా, గర్బడా. వీటిలో దనిలిండా, అంక్లవ్‌ మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లోనూ బీజేపీ విజయం సాధించడం విశేషం. భిలోడా నియోజకవర్గంలోనూ గతంలో ఒక్క 1995లోనే బీజేపీ విజయం సాధించింది. ఈసారి మళ్లీ ఆ నియోజకవర్గంలో కమలం విరబూసింది.

యాభై శాతానికి పైగా ఓట్లు.. 156 సీట్లు.. గుజరాత్‌లో బీజేపీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయం అంత సులువుగా వచ్చింది కాదు! ఎన్నో నెలల ముందస్తు ప్రణాళిక, వేసుకున్న ప్రణాళికను పక్కాగా అమలు చేసే యంత్రాంగం ఉండడం ఇందుకు ప్రధాన కారణాలు. కాంగ్రెస్‌ నిష్ర్కియ బీజేపీకి కలిసొచ్చిన అంశం. వీటన్నింటికీ మించిన మరో కారణం.. తన బలహీనతలపైన, కాంగ్రెస్‌ బలంగా ఉన్న స్థానాలపైనా బీజేపీ ప్రధానంగా దృష్టి సారించడమే. ముఖ్యంగా 2017లో కాంగ్రెస్‌ గెలిచిన అనేక సీట్లపై ఈసారి బీజేపీ దృష్టి సారించింది. మోర్బీ, సురేంద్రనగర్‌, సోమనాథ్‌, అమ్రేలీ తదితర ప్రాంతాల్లో పట్టు సాధించింది. ఆరు నెలల ముందే సౌరాష్ట్రలో ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది, పన్నాప్రముఖ్‌లను, బూత్‌ కమిటీలను నియమించడం, లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశాలు వంటివి చేపట్టింది. పనితీరు సరిగా లేని 35 మంది సిట్టింగ్‌ శాసన సభ్యులకు టికెట్లు నిరాకరించింది. వీరిలో స్పీకర్‌, ఐదుగురు మంత్రులు కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు కేటాయించింది.

2 కోట్ల మందిని కలిసి..

బీజేపీ ప్రచారం అనగానే చాలా మందికి గుర్తొచ్చే పదం.. పన్నా ప్రముఖ్‌. ఒక బూత్‌ పరిధిలోని ఓటర్లలో వీలైనంత ఎక్కువ మందిని కలవడానికి ఆ పార్టీ ‘పన్నా ప్రముఖ్‌’లను నియమిస్తుంది. పన్నా అంటే పేజీ. ఒక పేజీలో 20-25 మంది ఓటర్లు ఉంటే వారందరినీ ఈ పన్నా ప్రముఖ్‌లు కలిసి తమ పార్టీకి ఓటేసేలా ప్రభావితం చేస్తారు. ఈసారి గుజరాత్‌లో పన్నా కమిటీలను పెట్టారు. అంటే.. ప్రతి 20-25 మందికీ ఐదుగురు పన్నాప్రముఖ్‌లను నియమించారు. వీరు తమ పరిధిలోని ఒక్కో కుటుంబంలోని ఒకరిద్దరు వ్యక్తులను కలిసి.. వారి ద్వారా కుటుంబం మొత్తాన్నీ ప్రభావితం చేసేలా ప్రణాళిక రచించారు. వీరు గత కొన్ని నెలల్లో గుజరాత్‌లోని 82 లక్షల కుటుంబాలను.. 2 కోట్ల మంది ఓటర్లను కలిసినట్టు గుజరాత్‌ మీడియా కో-ఇన్‌చార్జ్‌ జుబిన్‌ ఆశారామ్‌ తెలిపారు. అలాగే.. ప్రచారంలో భాగంగా 3556 చోట్ల మ్యాజిక్‌ షోలు, 3700 ప్రాంతాల్లో వీధి నాటకాలు, 1400 ప్రాంతాల్లో ‘వికాస్‌ కా గర్బా’ పేరుతో ప్రచార రథాల ద్వారా ప్రజలను ప్రభావితం చేశారు. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునేందుకు 1700 ఫ్లాష్‌ మాబ్‌లు, 150 స్మార్ట్‌ రథాల ద్వారా ప్రచారం చేశారు. ‘యూత్‌ విత్‌ నమో’ పేరుతో 1400 చోట్ల సంగీత ప్రదర్శనలు నిర్వహించారు. ఇలా నిత్యం.. అడుగడుగునా.. గుజరాత్‌లో ఎక్కడ చూసినా బీజేపీ ప్రచారమే హోరెత్తిపోవడంతో వేరే పార్టీల ఉనికి నామమాత్రమైంది!

తిరిగొచ్చిన పాటీదార్లు..

గుజరాత్‌లో పాటీదార్ల జనాభా 13 శాతం వరకు ఉంది. రాష్ట్ర రాజకీయాలపై వారికి గట్టిపట్టుంది. ఆర్థికంగా కూడా బలవంతులు. 1995 నుంచి బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. అయితే తమకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో 2015లో వారు ఉద్యమం ప్రారంభించారు. ఇది హింసాత్మకమై పోలీసు కాల్పులకు దారి తీసింది. 14 మంది ఉద్యమకారులు చనిపోవడంతో పాటీదార్లు ఆగ్రహించారు. ఇది ఆనందిబెన్‌ పటేల్‌ రాజీనామాకు దారితీసింది. 2017 ఎన్నికల్లో కాంగ్రె్‌సకు అనుకూలంగా పనిచేశారు. ఫలితంగా ఆ పార్టీ పుంజుకున్నా అధికారంలోకి రాలేకపోయింది. 99 స్థానాలకే బీజేపీ పరిమితమైనా మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పాటీదార్లను బుజ్జగించే చర్యలు చేపట్టింది. జాతీయ స్థాయిలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమల్లోకి తేవడంతో ఆ కోటాలో పాటీదార్లూ లబ్ధిపొందడానికి ఆస్కారం ఏర్పడింది. సుప్రీంకోర్టు సైతం ఈ రిజర్వేషన్లను సమర్థించడంతో వారిలో బీజేపీపై ఉన్న అసంతృప్తి తొలగిపోయింది. 2015 నుంచి పాటీదార్లను ముందుండి నడిపిన హార్దిక్‌ పటేల్‌ 2019లో కాంగ్రె్‌సలో చేరినా.. అక్కడ తనకు, తన వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం దక్కకపోవడంతో ఈ ఏడాదిలో యూటర్న్‌ తీసుకుని బీజేపీలో చేరారు. వీరంగం స్థానంలో బీజేపీ తరఫున పోటీచేసి విజయం కూడా సాధించారు. పాటీదార్లు పూర్తిగా కాషాయ పార్టీకి అనుకూలంగా పనిచేసినట్లు తేటతెల్లమవుతోంది. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన యువ ఓబీసీ నేత అల్పేశ్‌ ఠాకూర్‌ మధ్యలోనే బీజేపీలో చేరినా ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి గాంధీనగర్‌ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఓబీసీలను బీజేపీ వైపు మళ్లించడంలో కీలక భూమిక పోషించారు. అలాగే.. గత ఎన్నికల్లో కాంగ్రె్‌సకు అండగా నిలిచి బీజేపీకి ముచ్చెమటలు పట్టించిన హార్దిక్‌ పటేల్‌, అల్పేశ్‌ ఠాకూర్‌, జిగ్నేశ్‌ మేవానీల్లో.. హార్దిక్‌, అల్పేశ్‌ కు వల వేసి వారిని తమ వైపునకు తెచ్చుకోవడంలో బీజేపీ నేతలు కృతకృత్యులయ్యారు.

Updated Date - 2022-12-09T01:31:47+05:30 IST