NTR: పునీత్‌కి కర్నాటక రత్న.. తన తల్లి పుట్టిన గడ్డపై వేడుకలకి హాజరు కానున్న ఎన్‌టీఆర్

ABN , First Publish Date - 2022-11-01T13:15:26+05:30 IST

ప్రత్యేక కర్ణాటక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నవంబరు నెల వచ్చిందంటే రాష్ట్రమంతటా పండుగలా కన్నడ రాజ్యోత్సవాలు ఏటా కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకుంటారు.

NTR: పునీత్‌కి కర్నాటక రత్న.. తన తల్లి పుట్టిన గడ్డపై వేడుకలకి హాజరు కానున్న ఎన్‌టీఆర్

ప్రత్యేక కర్ణాటక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నవంబరు నెల వచ్చిందంటే రాష్ట్రమంతటా పండుగలా కన్నడ రాజ్యోత్సవాలు ఏటా కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకుంటారు. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రమంతటా కన్నడ పతాకాలు రెపరెపలాడనున్నాయి. ప్రతి వీధిలోను కన్నడ గేయాలాపనలతో పాటు ఇతర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘ఎల్లాదరు ఇరు ఎంతాదరు ఇరు ఎందెందిగూ నీ కన్నడవాగిరు... కన్నడ గోవిన గోముద్దిన కరు కన్నడవే సత్య కన్నడవే నిత్య’ అని జాతీయకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కుప్పళ్లి వెంకటప్ప పుట్టప్ప(కువెంపు) నినాదం ప్రతి చోటా విరాజిల్లుతోంది. అంటే.. ‘ఎక్కడున్నా గణనాథుడవు, కన్నడవై ఉండు.. కన్నడం ఆవు దూడ, కన్నడ సత్యం, కన్నడ శాశ్వతం’ అని దానార్థం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కర్ణాటక రత్న పురస్కారాన్ని పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అలియాస్‌ అప్పుకు ఇప్పటికే ప్రకటించింది. పురస్కారాన్ని ప్రదానం చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. విధాన సౌధ తూర్పు ద్వారా మెట్లపై భారీ వేదికను సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉండే కన్నడిగులు కన్నడ దినోత్సవాన్ని జరుపుకునే రోజునే కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మూడునెలల కిందటే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే మంగళవారం మధ్యాహ్నం పునీత్‌ కుటుంబీకులకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. కర్ణాటక రత్న ప్రదానోత్సవానికి కర్ణాటకతో సంబంధం ఉండే తెలుగు, తమిళ ప్రముఖ నటులను ఆహ్వానించారు.

సినిమా కార్యక్రమాలు మినహా ఇతర భాషల నటులు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనడం అరుదు. కానీ పునీత్‌ పట్ల తెలుగు, తమిళ నటులే కాకుండా ప్రజలు ప్రత్యేక అభిమానాన్ని చూపేవారు. ఇదే కారణంతోనే ప్రముఖ తెలుగు హీరో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ను ప్రభుత్వం తరపున స్వాగతించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా సానుకూలంగా స్పందించారు. పునీత్‌కు దక్కుతున్న గౌరవం, కుటుంబ సభ్యులంతా హాజరవుతున్నందున తప్పనిసరిగా పాల్గొంటానని జూనియర్‌ ఎన్‌టీఆర్‌ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. అందుకు అనుగుణంగానే జూనియర్‌ ఎన్టీఆర్‌ మంగళవారం మధ్యాహ్నానికే బెంగళూరుకు వెళ్లనున్నట్లు సమాచారం. సాయంత్రం విధాన సౌధ వద్ద జరిగే కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు. జూనియర్‌ ఎన్‌టీఆర్‌ తల్లి ఉడిపి జిల్లా కుందాపురకు చెందినవారు కావడంతో ఆయనకి కన్నడ భాష, కర్ణాటక రాష్ట్రంతో పాటు కన్నడిగులన్నా ప్రత్యేక అభిమానం ఉంది. ఇక తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొంటారు. కన్నడ కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ కుటుంబీకులతో రజనీకాంత్‌కు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. కార్యక్రమానికి హాజరుకావాలని ప్రభుత్వం కోరగా సానుకూలంగా స్పందించిన రజనీకాంత్‌ వస్తున్నారు.

ఏర్పాట్ల పరిశీలన..

కర్ణాటక రత్న పురస్కార కార్యక్రమ ఏర్పాట్లను సోమవారం మంత్రులు అశోక్‌, సునిల్‌కుమార్‌ పరిశీలించారు. భారీ వేదికతో పాటు ప్రముఖులు, సినీ ప్రముఖులకు ప్రత్యేక సీట్లు వేశారు. మంత్రులతో పాటు ప్రతిపక్షనేతలు సిద్దరామయ్య, కుమారస్వామి వంటి వారికే కాకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. పునీత్‌ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆసనాలు సిద్ధం చేశారు. కార్యక్రమం కోసం ఐదువేల పాసులు మంజూరు చేశారు. విధానసౌధ ముందు ఉండే రోడ్డుపై నుంచి కూడా ప్రజలు తిలకించేవిధంగా ఏర్పాట్లు చేశారు.

వరుసగా పునీత్‌ కార్యక్రమాలు..

వారం రోజులుగా పునీత్‌రాజ్‌కుమార్‌కు సంబంధించి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇటీవలే పునీత్‌ నటించిన చివరి చిత్రం గంధదగుడి విడుదలకు ముందు పునీత్‌ పర్వ సభ ప్యాలెస్‌ మైదానంలో జరిగింది. శాండల్‌వుడ్‌ నటులంతా భాగస్వామ్యులయ్యారు. ముఖ్యమంత్రి బొమ్మైతో పాటు పునీత్‌ కుటుంబీకులు పాల్గొన్నారు. తాజాగా పునీత్‌ చివరి చిత్రం గంధదగుడి రాష్ట్రమంతటా విడుదలయింది. ఇక కన్నడ రాజ్యోత్సవం రోజునే కర్ణాటక రత్న పురస్కారం ప్రదానం చేయనున్నారు.

Updated Date - 2022-11-01T13:22:54+05:30 IST