Crude Oil: భారత్ వార్నింగ్.. పర్యవసానాలు తప్పవంటూ..

ABN , First Publish Date - 2022-10-31T21:06:11+05:30 IST

చమురు ధరలు పెరిగే కొద్దీ ఆర్థికమాంద్యం ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతుందని భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తాజాగా హెచ్చరించారు.

Crude Oil: భారత్ వార్నింగ్.. పర్యవసానాలు తప్పవంటూ..

అబుదాభీ: చమురు ధరలు(Crude Oil) పెరిగే కొద్దీ ఆర్థికమాంద్యం ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతుందని భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ(Hardeep Singh puri) తాజాగా హెచ్చరించారు. ప్రపంచం మరింత వేగంగా పర్యావరణ హిత ఇంధనాలవైపు మళ్లుతుందని కూడా పేర్కొన్నారు. అబుదాభిలో తాజాగా జరిగిన అడిపెక్ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చమురు ధరల మరింత పెరగకుండా ఒపెక్ దేశాలు నియంత్రిస్తే అది వారికే మంచిది’’ అని కామెంట్ చేశారు. యూఏఈ, సౌదీ అరేబియా, తదితర ఒపెక్(Opec+) కూటమి దేశాల నుంచి భారత్ భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒపెక్ దేశాలు.. వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు నిర్ణయించాయి. దీంతో..అమెరికా బహిరంగంగానే ఒపెక్ దేశాలను విమర్శించింది. కానీ.. భారత్ మాత్రం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఈ నేపథ్యంలోనే ఒపెక్ దేశాలను ఉద్దేశించి మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇవి.. స్వతంత్ర దేశాలు తీసుకున్న నిర్ణయాలు. తమ వస్తువులను ఎంతకు అమ్మాలనే హక్కు ఉత్పత్తిదారులదే. కానీ.. ప్రతి చర్యకూ పర్యవసానాలు ఉంటాయి. వీటిలో కొన్ని మనం ఆశించనివీ ఉంటాయి. ఈ విషయాన్ని మేము అవకాశం వచ్చిన ప్రతిసారీ చెబుతూనే ఉన్నాం. చమురు ధరల పెరుగుదల కారణంగా బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు విద్యుత్ వాహనరంగంలోకి మళ్లుతున్నాయి. ఇవన్నీ అద్భుతమైన విషయాలు. వీటి వల్ల మేమూ ప్రయోజనం పొందుతాం. ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గం వైపు మళ్లుతాం’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అమెరికా ఆంక్షలను ఇరు దేశాలు భవిష్యత్తులోనూ లక్ష్యపెట్టవని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-10-31T21:19:07+05:30 IST