Supreme Court : కొలీజియంపై కేంద్రం అమీతుమీ!

ABN , First Publish Date - 2022-12-07T04:37:08+05:30 IST

కొలీజియం వ్యవస్థ విషయంలో సుప్రీం కోర్టుతో అమీతుమీకి కేంద్రం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పలు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు

Supreme Court : కొలీజియంపై కేంద్రం అమీతుమీ!

21 సిఫారసులు.. రెండింటికే ఆమోదం

మిగతా వాటిని వెనక్కి పంపిన కేంద్ర న్యాయశాఖ

న్యాయమూర్తుల నియామకాల్లో ప్రతిష్టంభన

కొలీజియంపై కొంతకాలంగా న్యాయ మంత్రి విమర్శలు

సిఫారసులను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీం అసహనం

న్యూఢిల్లీ, డిసెంబరు 6: కొలీజియం వ్యవస్థ విషయంలో సుప్రీం కోర్టుతో అమీతుమీకి కేంద్రం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పలు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసిన 21మందిలో 19మంది పేర్లను కేంద్రం ఇటీవల తిప్పి పంపించినట్లు సమాచారం. వాటిలో 10మందికి సంబంధించిన సిఫారసులను సుప్రీం కోర్టు చాలాకాలం కిందటే న్యాయశాఖకు పంపించింది. కేంద్రం గతంలోనే ఆ జాబితాను వెనక్కి పంపగా... సుప్రీం కోర్టు అదే జాబితాను మళ్లీ సిఫారసు చేసింది. అయితే కేంద్రం ఆ జాబితాను మళ్లీ వెనక్కి పంపించింది. అంతేగాక తాజాగా సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన 9 మంది న్యాయమూర్తుల నియామకాలు కూడా వెనక్కి వచ్చాయి. కొలీజియం సిఫారసుల్లో రెండింటిని ఆమోదించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవల ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. బాంబే హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన సంతోష్‌ గోవింద్‌ చపల్‌గోవ్‌కర్‌, మిలింద్‌ మనోహర్‌ సతాయే నియామకాలను కేంద్రం ఆమోదించింది. రాజ్యాంగ్నాన అనుసరించి సదరు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించినట్లు కేంద్ర మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నియామకాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సెప్టెంబరు 12న కేంద్రానికి పంపించింది. కాగా... కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కొంతకాలంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియం వ్యవస్థలో లొసుగులు ఉన్నాయని, పారదర్శకత లేదని, రాజ్యాంగంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థను పేర్కొనలేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ కూడా సుప్రీం కోర్టుపై బహిరంగంగా, ప్రధాన న్యాయమూర్తి ఎదుటే విమర్శలు చేశారు.

జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్‌ కమిషన్‌ను సుప్రీం రద్దుచేయడాన్ని ఉపరాష్ట్రపతి తీవ్రంగా తప్పుబట్టారు. అదే సమయంలో కొలీజియం సిఫార్సులను కేంద్రం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీం కోర్టు కూడా పలుమార్లు అసహనం వ్యక్తం చేసింది. దీనిపై నవంబరు 28లోగా వివరణ ఇవ్వాలంటూ నవంబరు 11న న్యాయశాఖకు సాధారణ నోటీసు కూడా జారీచేసింది. ఈ అంశంపై 28న సుప్రీంలో వాదనలు జరగాల్సి ఉండగా... వాదనలు ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే కొలీజియం సిఫార్సులను కేంద్రం వెనక్కి పంపించడం గమనార్హం. సంప్రదాయం ప్రకారం... కొలీజియం గతంలో చేసిన సిఫార్సులనే పునరుద్ఘాటించినప్పుడు కేంద్రం విధిగా వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. తాజా పరిణామాలతో కొలీజియం వ్యవస్థపై నెలకొన్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా న్యాయమూర్తుల నియామకాల్లో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉంది. కేంద్రం వెనక్కి పంపిన జాబితాలో అలహాబాద్‌, కలకత్తా, కేరళ, కర్ణాటక హైకోర్టులకు సంబంధించిన న్యాయమూర్తుల నియామకాలు ఉన్నాయి. అలాగే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాను సుప్రీం న్యాయమూర్తిగా నియమిస్తూ సెప్టెంబరు 26న కొలీజియం చేసిన సిఫార్సు కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.

Updated Date - 2022-12-07T04:37:46+05:30 IST